Old Pension Scheme | పాత పెన్షన్ పథకం పునరుద్ధరించే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాద్ తేల్చి చెప్పారు. సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో ఆయన ఈ సంగతి ప్రకటించారు. పాత పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు నిర్ధిష్ట పెన్షన్ లభిస్తుంది. చివరి నెల వేతనంలో సగం వేతనం పెన్షన్గా పొందుతారు. కానీ, 2004లో అమల్లోకి వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ మొత్తం కంట్రిబ్యూటరీగా ఖరారు అవుతుంది.
తమ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పున: ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వానికి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)కు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నది.
మరోవైపు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని గత నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయమై పంజాబ్ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇవ్వలేదని భగవత్ కరాడ్ వివరించారు. అయితే, పాత పెన్షన్ పథకం అమలు చేయడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ యాక్ట్ -2013 కింద ఎటువంటి నిబంధనల్లేవని స్పష్టం చేశారు.