న్యూఢిల్లీ, జూలై 22: ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలుకున్న ఆఖరు తేదీని పొడిగించే ఉద్దేశం ఏమీలేదని రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు. ఈ నెల 31తో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్న్స్ ఫైలింగ్కున్న గడువు తీరిపోతున్నది. ఈ క్రమంలో మరికొద్దిరోజులు అవకాశం ఇస్తారన్నదాన్ని బజాజ్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదన్నారు. ఈ నెల 20 నాటికి 2.3 కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని, ఈ నెలాఖరుకల్లా దాదాపు అన్ని రిటర్నులు ఫైలింగ్ అవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం పీటీఐతో బజాజ్ మాట్లాడుతూ ‘గడువు తేదీలను పొడిగిస్తార్లే అనే ఆలోచనతోనే ఎక్కువమంది ఉంటారు. అందుకే మొదట్లో ఫైలింగ్ నెమ్మదిగా నడుస్తుంది. కానీ ఇప్పుడు రోజువారీ ఐటీఆర్లు పెరిగాయి. 15-18 లక్షలుగా ఉన్నాయి. మున్ముందు 25-30 లక్షలకూ వెళ్తాయి. సాధారణంగా చివరిరోజుదాకా రిటర్నులు దాఖలుచేసేవారు వేచిచూస్తూ ఉంటారు’ అన్నారు. నిరుడు చివరిరోజునే 9-10 శాతం దాఖలైనట్టు గుర్తుచేశారు.