Budget on Gold | ఒకవేళ మీ దగ్గర ఉన్న బంగారం ఆభరణాలను డిజిటల్ గోల్డ్గా మార్చాలని భావిస్తున్నారా.. అలా చేస్తే.. దాన్ని క్యాపిటల్ గెయిన్స్గా పరిగణించరు. అలా మార్చిన బంగారం విలువపై పన్ను విధించరు. ఈ సంగతి స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బుధవారం ఆమె 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిజికల్ గోల్డ్ను ఎలక్ట్రానిక్ గోల్డ్గా మార్చుకుంటే దాన్ని ట్రాన్స్ఫర్గా గుర్తించరు. ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ పరిధిలోకి రాదు. దీన్ని ఎలక్ట్రానిక్ ఈక్విలెంట్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ల ప్రోత్సాహంగా పరిగణిస్తారని చెప్పారు.
బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 25 శాతానికి పెంచారు. తాజా సవరణలో సోషల్ వెల్ఫేర్ సర్చార్జి (ఎస్డబ్ల్యూఎస్) తొలగించారు. ఇక అగ్రికల్చరల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ (ఏఐడీసీ) యథాతథంగా కొనసాగుతుంది. కస్టమ్స్ డ్యూటీ పెంపు 2023 ఫిబ్రవరి రెండో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
గతేడాది 2022-23 బడ్జెట్లో నిర్మలా సీతారామన్.. కట్ లేదా పాలిష్డ్ డైమండ్లపై దిగుమతి సుంకం 7.5 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించి వజ్రాల వ్యాపారులకు రిలీఫ్ కల్పించారు. కానీ బంగారంపై దిగుమతి సుంకం యధాతథంగా కొనసాగించడం బులియన్ మార్కెట్ వర్గాలను నిరుత్సాహ పరిచింది. ఇదిలా ఉంటే ఇంతకుముందు అమల్లో ఉన్న బంగారం దిగుమతి సుంకం 10.75 నుంచి 15 శాతానికి పెంచుతూ గత జూలైలో కేంద్రం నిర్ణయం తీసుకున్నది. బంగారంపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) 7.5 నుంచి 12.5 శాతానికి పెంచారు. ఏఐడీసీ యధాతథంగా 2.5 శాతంగా కొనసాగించారు.