పాట్నా: ప్రధానమంత్రి కావడానికి బీహార్ సీఎం నితీశ్కుమార్కు అన్ని లక్షణాలు ఉన్నాయని, కానీ ఆయన ప్రధాని పదవి రేస్లో లేరని యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) వివరణ ఇచ్చింది. ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గం తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలపై నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ఇదంతా నాన్సెన్స్ అని పేర్కొన్నారు. “నేనెప్పుడు ఇది కోరుకోలేదు.. (దీన్ని) ఆశించలేదు” అని వ్యాఖ్యానించారు.
జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. “ఈ అంశాన్ని దాటేశారు. నితీశ్ కుమార్ ప్రధాని పదవిని కోరుకోవట్లేదు. మేం ఎన్డీఏలో ఉన్నాం. మా కూటమి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ. అయినా ప్రధాని కావడానికి నితీశ్ కుమార్ అన్ని అర్హతలు ఉన్నాయి” అని చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో జేడీయూ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన ఉపేంద్ర కుశ్వాహా మాట్లాడుతూ.. “దేశ ప్రజలు నరేంద్రమోదీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన మంచి పనులు చేస్తున్నారు. కానీ.. ప్రధాని కా దగిన అర్హతలు ఉన్న నేతల్లో నితీశ్ కుమార్ ఉన్నారు. కానీ ప్రధాని మోదీని సవాల్ చేయడం లేదు” అని అన్నారు. ఈ నేపథ్యంలో జేడీయూ ఆదివారం వివరణ ఇచ్చింది.