Nitin Gadkari | భారత్ మార్కెట్లోకి ఎలన్మస్క్ సారధ్యంలోని టెస్లా విద్యుత్ కార్ల ఎంట్రీకి దాదాపు దారులు మూసుకుపోయినట్లు కనిపిస్తున్నది. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్లోకి వస్తుందా.. రాదా.. అన్న సంగతి పక్కనబెడితే అంతకంటే మెరుగైన విద్యుత్ కార్లు తయారు చేయగల సంస్థలు దేశంలో ఉన్నాయని చెప్పారు. తొలుత దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు తగ్గించి విక్రయించడానికి.. ఆపై సర్వీసింగ్కు అనుమతి ఇస్తేనే భారత్లో కార్ల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తామని ఎలన్మస్క్ గత నెలలో వ్యాఖ్యానించారు.
చైనాలో తయారు చేసిన టెస్లా కార్లను భారత్లో విక్రయించడానికి అనుమతించబోమని నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయగల సామర్థ్యం భారత్ కార్ల తయారీ సంస్థలకు ఉందని స్పష్టం చేశారు.
`మనకు అన్ని రకాల ఆటోమొబైల్ బ్రాండ్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి రెండు ఇక్కడ లేకపోవచ్చు. చైనాలో కార్లు తయారు చేసి భారత్లో విక్రయించాలన్న ప్రతిపాదన ఆచరణ యోగ్యం కాదని టెస్లా కంపెనీకి చెప్పాం. ఒకవేళ భారత్ మార్కెట్లోకి రావాలని మీకు ఆసక్తి ఉంటే ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందే` అని టెస్లా సీఈవో ఎలన్మస్క్కు పరోక్షంగా గడ్కరీ సూచించారు. భారత్లో ప్రతిభావంతులైన యువ డిజైనర్లు పుష్కలంగా ఉన్నారని తెలిపారు. ఇతరుల కంటే మెరుగైన కార్లను మన కార్ల తయారీ సంస్థలు తయారు చేయగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.