న్యూఢిల్లీ, జూన్ 29: అధిక సంఖ్యలో మహిళల్ని, దివ్యాంగుల్ని నియమించుకున్న స్టార్టప్లకు పన్ను రాయితీలు లేదా గ్రాంట్ల రూపంలో ఆర్థిక ప్రోత్సాహాకాలివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సుచేసింది. ‘ఇండియా బూమింగ్ గిగ్, ప్లాట్ఫామ్ ఎకానమీ’ పేరుతో నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్లో పలు సూచనల్ని చేసింది. మొత్తం సిబ్బందిలో మూడింట ఒక వంతు మహిళలు, దివ్యాంగుల్ని సంస్థలు నియమించుకుంటే ప్రోత్సాహాకాలివ్వాలంది.
16 శాతం నుంచి 23 శాతం వరకూ మహిళలు, 36 శాతం దివ్యాంగుల భాగస్వామ్యంతో గిగ్ ఎకానమీ (తాత్కాలిక సిబ్బందిని, కాంట్రాక్ట్ సిబ్బందిని తీసుకునే స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ) ఏర్పడుతుందని, అందుచేత ఈ రెండు విభాగాలకు చెందిన సిబ్బంది నైపుణ్యాల్ని పెంచి, వారి ఉద్యోగ సామర్థ్యానికి తగినరీతిలో ఎడ్యుకేట్ చేయాలని సూచించింది. జొమా టో, స్విగ్గీ, ఓలా, ఉబర్ తదితర ప్లాట్ఫామ్ కంపెనీల్లో పనిచేసేవారికి సామాజిక భద్రతా పథకాల్ని వర్తింపచేయాలని కూడా నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. పెండ్లి తర్వాత మహిళలు ప్లాట్ఫామ్ జాబ్స్ చేయడానికి మక్కువ చూపుతున్నట్టు ఒక సర్వేలో తేలినందున, గిగ్ ఎకానమీలో మహిళల్ని ప్రోత్సాహించాలన్నది. ఓల్డ్ ఏజ్ లేదా రిటైర్మెంట్ ప్లాన్లు ఆఫర్ చేసే పాలసీలను, పని సమయంలో జరిగే ప్రమాదాలకు రక్షణ కల్పించే బీమా పాలసీలను సంస్థలు వర్కర్లకు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించింది.