పడుతూ.. లేస్తూ సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ అలజడి. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయడంతో సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో అత్యంత భీకర నష్టాన్ని చవిచూసింది. దీంతో మార్కెట్ సంపద ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల్లో కరిగిపోయింది.
Stock Markets | ముంబై, జనవరి 17: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం పెద్ద కుదుపే చోటుచేసుకున్నది. ఉదయం ఆరంభం నుంచే మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయడంతో సూచీలు భారీ నష్టాలకు లోనయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ బ్యాంకింగ్, మెటల్, చమురు రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,628.01 పాయింట్లు లేదా 2.23 శాతం క్షీణించి 71,500.76 వద్ద ముగిసింది. గడిచిన ఏడాదిన్నరకుపైగా కాలంలో ఒక్కరోజే ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. 2022 జూన్ 13న చివరిసారిగా ఈ స్థాయిలో సెన్సెక్స్ నష్టాలను చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. ఇక ఒకానొక దశలో 1,699.47 పాయింట్లు దిగజారడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 460.35 పాయింట్లు లేదా 2.09 శాతం పతనమై 21,571.95 వద్ద నిలిచింది.
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మంగళవారం ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలే.. ఇంతటి భారీ నష్టాలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా లేవని, అందుకే మదుపర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్తోపాటు మొత్తం బ్యాంకింగ్ షేర్ల అమ్మకానికి తెగబడ్డారని వారు చెప్తున్నారు. క్యూ3లో బ్యాంక్ నికర లాభం రూ.17,258 కోట్లుగా ఉన్నది. గతంతో పోల్చితే 2.65 శాతం పెరిగినా.. ఇన్వెస్టర్లను నిరాశపర్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల విలువ ఏకంగా 8 శాతానికిపైగా క్షీణించింది. సెన్సెక్స్లో గరిష్ఠంగా 8.46 శాతం దిగజారి రూ.1,536.90 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలోనైతే 9 శాతం పడిపోయింది. ఇక నిఫ్టీలోనూ 8.15 శాతం నష్టపోయి రూ.1,542.15 వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఈ ఒక్కరోజే కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలకుపైగా పడిపోయింది. రంగాలవారీగా చూస్తే.. బ్యాంకింగ్ అత్యధికంగా 4.02 శాతం దిగజారింది. ఆర్థిక సేవలు 3.76 శాతం, మెటల్ 2.86 శాతం, కమాడిటీస్ 2.31 శాతం, టెలీ కమ్యూనికేషన్ 1.94 శాతం, రియల్టీ 1.47 శాతం చొప్పున క్షీణించాయి.
మంగళ, బుధవారాల్లో స్టాక్ మార్కెట్ నష్టాలు.. దాదాపు రూ.6 లక్షల కోట్ల మదుపరుల సంపదను ఆవిరి చేసేశాయి. బుధవారం ఒక్కరోజే రూ.4,59,327.64 కోట్లు హరించుకుపోగా, అంతకుముందు రోజు నష్టంతో చూస్తే ఇది రూ.5,73,576.83 కోట్లకు చేరింది. దీంతో ప్రస్తుతం బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.3,70,35,933.18 కోట్లకు పరిమితమైంది. వడ్డీరేట్ల తగ్గింపుపై అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ చేసిన వ్యాఖ్యలు అటు యూఎస్ పదేండ్ల బాండ్ల ఈల్డ్స్ను పెంచగా, ఇటు డాలర్ ఇండెక్స్ను ఎగదోసింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గిస్తేనే.. దేశంలో ఆర్బీఐ కూడా వడ్డీ కోతల దిశగా కదులుతుంది. అక్కడ ఆలస్యమైతే ఇక్కడా అంతే. దీంతో బ్యాంకింగ్ షేర్లతోపాటు స్టీల్, రియల్టీ ఇతరత్రా ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ షేర్లూ కుప్పకూలాయంటున్నారు.
వడ్డీరేట్ల కోతల ఆశలపై ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నీళ్లు చల్లింది. వడ్డీరేట్లు ఇప్పుడప్పుడే తగ్గబోవని ఫెడ్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ అన్నారు. ఓ సదస్సులో మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుందని, ద్రవ్యోల్బణం కూడా దిగివస్తున్నదన్న ఆయన.. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను తొందరగా తగ్గించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఇప్పట్లో వడ్డీరేట్ల కోతలుండవనే సంకేతాలు ఇచ్చినైట్టెంది. నిజానికి ఈ ఏడాది మార్చి నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడం మొదలుపెడుతుందని బలమైన అంచనాలున్నాయి. కానీ వాలర్ వ్యాఖ్యలతో ఈ అంచనాలకు గండి పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాలకు లోనయ్యాయి.