న్యూఢిల్లీ, మే 18: నిధుల సమీకరణ కోసం ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకుంటున్న మోదీ సర్కార్.. మరోవైపు జాతీయ రహదారుల ఆస్తులనూ వదలడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో 28 జాతీయ రహదారులను అమ్మేయాలని చూస్తున్నది మరి. 1,800 కిలోమీటర్లకుపైగా పొడవున్న ఈ నేషనల్ హైవేల ఆస్తుల నగదీకరణతో దాదాపు రూ.35,000 కోట్లను పొందాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంబంధిత ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అమ్మదగిన జాతీయ రహదారులను గుర్తించినట్టూ తెలుస్తున్నది.
విక్రయించాలనుకుంటున్న హైవేలలో ఎక్కువ భాగం హర్యానాలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్టు ఓ ప్రభుత్వ అధికారి చెప్తున్నారు. కాగా, ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్)తోపాటు టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్ధతుల ద్వారా నగదీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వాడుకలో ఉన్న రోడ్ల ద్వారానే కొత్త రహదారుల నిర్మాణానికి కాసులు రాబట్టాలన్నదే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉద్దేశమని అంటున్నారంతా.
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో హైవేల నగదీకరణతో ఖజానాకు రూ.29,000 కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం ఆరంభంలోనే తొలి ప్రభుత్వ ఇన్విట్ ద్వారా రూ.9,000 కోట్లకుపైగా నిధులను సమీకరించారు. 4 రాష్ర్టాల్లో 260కిపైగా కిలోమీటర్ల మేర ఉన్న 5 హైవేలను అమ్మేశారు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని హైవేలను అమ్మకానికి తెస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్ల టార్గెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అంతేగాక 2025-26 నుంచి 2029-30 మధ్య జాతీయ రహదారుల ఆస్తుల నగదీకరణతో రూ.4.42 లక్షల కోట్ల నిధులను సమీకరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం గమనార్హం.
త్వరలో జీపీఎస్ ఆధారిత టోలింగ్ వ్యవస్థ రానున్నది. ఈ సిస్టమ్లో వాహనాలకుండే నెంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతను వినియోగించి, ఎంత దూరం ప్రయాణించారన్న కచ్చితమైన సమాచారంతో చార్జీలను వసూలు చేయనున్నారు. దీంతో ఇప్పుడు జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాలు మున్ముందు కనుమరుగవనున్నాయి. అంతేగాక వాహనాల రద్దీ కారణంగా టోల్గేట్ల వద్ద ఆగాల్సిన పరిస్థితి కూడా ఉండదంటున్నారు. వాహనదారులపై టోల్ చార్జీల భారం కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకల్లా దేశవ్యాప్తంగా ఈ జీపీఎస్ టోలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని కేంద్రం చూస్తున్నది.