ముంబై, డిసెంబర్ 21: బిట్కాయిన్ తదితర క్రిప్టో సాధనాల్ని నిషేధించాల్సిన అవసరం ఉందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నొక్కిచెప్పారు. ఇటువంటి స్పెక్యులేటివ్ సాధనాల్ని ఎదగనిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రైవేటు క్రిప్టోకరెన్సీ ద్వారానే తలెత్తుతుందని ఆయన హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీలను దాస్ తొలినుంచీ వ్యతిరేకిస్తున్న తెలిసిందే.
బుధవారం ముంబైలో ఒక సదస్సులో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ తాజాగా క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ ఎఫ్టీఎక్స్ దివాళా తీయడం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసంగా అభివర్ణించారు. క్రిప్టో సాధనాలు ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం తెలియపరుస్తున్నదన్నారు.
వీటికి విలువ లేదు
ప్రైవేటు క్రిప్టోకరెన్సీల విలువ 190 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు పడిపోయిందని, వీటి మార్కెట్ ఆధారిత ధరకు అంతర్లీన విలువ ఏదీ లేదన్నారు. ‘ఇది 100 శాతం స్పెక్యులేటివ్ యాక్టివిటీ, దీనిని నిషేధించాలన్నదే నా అభిప్రాయం, వీటిని నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చి, ఎదగనిస్తే, నా మాటలు గుర్తుంచుకొండి, క్రిప్టోలతో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది’ అని దాస్ హెచ్చరించారు.