New Income Tax Regime | సోమవారం (2024, ఏప్రిల్ ఒకటో తేదీ) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభమైంది. తదనుగుణంగా ఆర్థికపరమైన అంశాలపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే, ఆదాయం పన్ను విధానంపై ప్రజలను, పన్ను చెల్లింపుదారులను తప్పుదోవ పట్టించే సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సంగతి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ద్రుష్టికి వచ్చింది. దీంతో కొత్త ఆదాయం పన్ను విధానంపై సందేహాలను నివ్రుత్తి చేయడంతోపాటు పన్ను పాలసీ ముఖ్యాంశాలను ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరం రిటర్న్లు ఫైల్ చేసే వారు కొత్త ఆదాయం పన్ను పాలసీ నుంచి తప్పుకునేందుకు వీలు ఉంటుంది. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉంటది. వ్యక్తిగత ఆదాయం ప్రత్యేకించి వేతన జీవులు ఒక ఏడాది కొత్త ఆదాయంపన్ను విధానం, మరొక ఏడాది పాత ఆదాయం పన్ను విధానం ఎంచుకోవచ్చు.
కొత్త ఆదాయం పన్ను విధానం (115 బీఏసీ (ఐఏ) కింద రూ.3 లక్షల ఆదాయం వరకూ పన్ను చెల్లించనవసరం లేదు. రూ.3-6 లక్షల వరకూ ఐదుశాతం, రూ.6-9 లక్షల మధ్య ఆదాయం గల వారు 10 శాతం, రూ.9-12 లక్షల మధ్య ఆదాయం గల వారు 15శాతం, రూ.12-15 లక్షల మధ్య ఆదాయం గల వారు 20 శాతం, రూ.15 లక్షల పై చిలుకు ఆదాయం గల వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటది.
పాత ఆదాయం పన్ను విధానం కింద రూ.2.5 లక్షల వరకూ పన్ను చెల్లించనవసరం లేదు. రూ.2.5 – 5 లక్షల మధ్య ఆదాయం గల వారు ఐదు శాతం, రూ.5-10 లక్షల మధ్య ఆదాయం కల వారు 20 శాతం వరకూ, రూ.10 లక్షల పై చిలుకు ఆదాయం కల వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.