న్యూఢిల్లీ, జూలై 20: దేశంలో వేగవంతంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ సరికొత్త మోడల్ను పరిచయం చేసింది. ‘గ్రాండ్ విటారా’ పేరుతో విడుదల చేసిన ఈ మోడల్ను 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో రూపొందించింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్లకు పోటీగా సంస్థ ఈ మోడల్ను ప్రవేశపెట్టింది.
మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ మోడల్ను ప్రవేశపెట్టినట్లు, ఆగస్టు నెలలో ఉత్పత్తిని ప్రారంభించి సెప్టెంబర్ నుంచి విక్రయాలు ఆరంభించాలనుకుంటున్నట్లు మారుతి ఎండీ, సీఈవో హిశాషి టకౌచి తెలిపారు. ఈ కారు ధర మాత్రం ఆయన వెల్లడించలేదు. లీటర్కు 27.97 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్న ఈ కారు దేశీయ మార్కెట్తోపాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా విడుదల చేయనున్నట్ల ఆయన ప్రకటించారు. వచ్చే మూడు నుంచి నాలుగేండ్లలో మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్ సైజ్ రెండింతలు కానున్నదన్నారు.