న్యూఢిల్లీ : కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో రెనాల్ట్ డస్టర్ భారత మార్కెట్లో పేరొందినా హ్యుందాయ్ క్రెటా తో గట్టి పోటీ ఎదురవడంతో ఆ తర్వాత సేల్స్ తగ్గుముఖం పట్టాయి. ఆపై 2019లో డస్టర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను లాంఛ్ చేసినా ఎస్ యూవీ విభాగంలో కుదురుకునేందుకు రెనాల్ట్ డస్టర్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమ్మకాలు పెరుగుతాయనే అంచనాతో రెనాల్ట్ తన ఎస్ యూవీలో అత్యంత శక్తివంతమైన టర్బీఛార్జిడ్ ఇంజన్ ను ప్రవేశపెట్టినా అంతగా ప్రభావం చూపలేదు.
భారత్ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు న్యూ జెన్ డస్టర్ తో రెనాల్ట్ రెడీ అయింది. వచ్చే ఏడాది న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ ను దేశీ మార్కెట్ లో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఇక న్యూ ప్లాట్ ఫాంపై ప్రస్తుత డసియా డస్టర్, బిగ్ స్టర్ కాన్సెప్ట్ ఆధారంగా న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ డిజైన్ కాబోతోందని సమాచారం. ఈ ఎస్ యూవీలో నూతన గ్రిల్, స్లీకర్ ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్, న్యూ టెయిల్ లైట్స్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించనున్నారు. నూతన మోడల్ లో భారీ టచ్ స్క్రీన్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి నావెల్ ఫీచర్లు ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు.