TCS-New Debit Card | చరిత్రలో మరో నెల మాయమవుతున్నది. మరో 24 గంటల్లో అక్టోబర్ నెల మొదలవుతున్నది. సెప్టెంబర్ మాదిరిగానే వచ్చేనెలలోనూ మీ జేబుకు చిల్లు పెట్టే మార్పులు, ఫైనాన్సియల్ డెడ్లైన్లు మొదలు కాబోతున్నాయి. విదేశీయానం చేసిన వారి లావాదేవీలపై కొత్త టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రూల్ మొదలు ఎల్ఐసీ పాలసీ పునరుద్ధరణ, ఎంచుకున్న కార్డ్ నెట్వర్క్ నుంచి డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తదితర మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేమిటో చూద్దామా..!
అక్టోబర్ నుంచి నూతన `ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)` నిబంధన అమల్లోకి రానున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యటనల్లో రూ.7 లక్షల ఖర్చు దాటినా.. విదేశీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు రూ.7 లక్సలు దాటినా మీ బ్యాంకు ఖాతా నుంచి 20 శాతం టీసీఎస్ డిడక్ట్ అవుతుంది. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ సిస్టమ్ (ఎల్ఆర్ఎస్) ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు 2.50 లక్షల డాలర్లకు పైగా బదిలీ చేస్తూ 20 శాతం టీసీఎస్ నిబంధన అమల్లోకి వస్తుంది. విద్యాభ్యాసం, వైద్య చికిత్సకు మినహాయింపునిచ్చింది కేంద్రం.
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమకు నచ్చిన ప్రొవైడర్ నెట్వర్క్ కార్డులను పొందొచ్చు. దేశంలో అందుబాటులో ఉన్న బహుముఖ కార్డుల నెట్వర్క్ల పరిధిలో మీకు ఇష్టమైన నెట్వర్క్ ఎంచుకునే ఆప్షన్ లభిస్తుంది. సదరు నెట్వర్క్ ద్వారా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా ప్రీ పెయిడ్ కార్డు పొందొచ్చు.
చాలా మంది కస్టమర్లు సకాలంలో డబ్బు లేక ఎల్ఐసీ ప్రీమియం చెల్లించకపోవడంతో వారి పాలసీలు ఎక్స్పైరీ అయిపోతాయి. అటువంటి వాటిని పునరుద్ధరించుకునేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పాలసీదారులకు మరో అవకాశం కల్పించింది. సెప్టెంబర్ ఒకటో తేదీన మొదలైన ఎల్ఐసీ ప్రత్యేక క్యాంపెయిన్ అక్టోబర్ నెలాఖరు వరకూ కొనసాగుతుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు ఎక్కువ వడ్డీపై `ఇండ్ సూపర్ 610`, ఇండ్ సుప్రీం 300 డేస్` అనే పేర్లతో తీసుకొచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో చేరేందుకు 2023 అక్టోబర్ 31 వరకూ గడువు పొడిగించింది.
దేశంలో పేరొందిన బ్యాంకు ఐడీబీఐ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నూతన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం `అమృత్ మహోత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం` తెచ్చింది. 375-444 రోజుల గడువుతో తీసుకొచ్చిన రెండు వేర్వేరు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో చేరేందుకు అక్టోబర్ 31తో గడువు ముగుస్తుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. వృద్ధుల కోసం `వుయ్ కేర్` అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. మళ్లీ ఈ పథకం గడువును ఎస్బీఐ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.