Nirmala on Crypto | అన్ని రకాల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం అమల్లోకి రానున్నది. అయితే, క్రిప్టో కరెన్సీ టెక్నాలజీ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ దాని వినియోగాన్ని ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులు లభిస్తాయి. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీలను కట్టడి చేయడానికి ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనున్నది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత క్రిప్టో కరెన్సీ బిల్లును పార్లమెంట్కు సమర్పిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ అనే బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం లోక్సభ బులెటిన్లో పేర్కొన్నది. ఈ బిల్లు చట్టంగా మారితే ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని సృష్టించేందుకు అవసరమైన ప్రేమ్వర్క్ ఏర్పాటవుతుంది.
క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు హై రిస్క్తో కూడుకున్నవని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెబుతున్నాయని, ప్రజలను హెచ్చరిస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ విషయమై ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుందన్నారు. భారత్లో క్రిప్టో కరెన్సీలను ప్రభుత్వం నియంత్రించడం లేదని, వాటిల్లో భారతీయుల లావాదేవీల డేటా ఏమీ కేంద్రం సేకరించలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న క్రిప్టో కరెన్సీల వాణిజ్య ప్రకటనలను నిషేధించే విషయమై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఎలా క్రిప్టో అడ్వర్ట్జైజ్మెంట్ల నియంత్రించాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు.
వర్చువల్ కరెన్సీలు: లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ రికమండేషన్స్ ఆఫ్ రెగ్యులేషన్ అనే అంశంపై ఒక పరిశోధనా సంస్థ ద్వారా 2017 జూలైలో ప్రభుత్వం సర్వే చేపట్టింది. దేశీయంగా అన్ని రకాల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని 2017 నవంబర్లో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సారధ్యంలోని కార్యదర్శుల కమిటీ సిఫారసు చేసింది.