న్యూఢిల్లీ, ఆగస్టు 10: 81 ఏండ్లు.. 60 ఏండ్ల కెరియర్.. ఎంతో శ్రమ.. అంతకుమించి విజయాలు.. ఇదీ.. దేశీయ బహుళ వ్యాపార, పారిశ్రామిక దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) గ్రూప్ చైర్మన్ అనీల్ మనిభాయ్ (ఏఎం) నాయక్ ఘనత. 77 ఏండ్ల కిందట మొదలైన ఎల్అండ్టీ వైభవం.. నాయక్తో మమేకమై విస్తరించినదే అననడంలో ఎటువంటి సందేహం లేదు. తాను 21 ఏండ్లు ఒక్క సెలవూ తీసుకోలేదని, మొదట్నుంచీ రోజుకు 15 గంటలు పనిచేశానని ఓ ప్రముఖ జాతీయ దినపత్రికతో తన మనోగతాన్ని నాయక్ పంచుకున్నారు. దాదాపు గత 6 దశాబ్దాలుగా ఎల్అండ్టీతో పనిచేస్తున్న ఆయన.. పరిస్థితులనుబట్టి ప్రతీ మూడేండ్లకోసారి తనను తాను మార్చుకున్నట్టు వివరించారు. తద్వారా తన సుదీర్ఘకాల విజయవంతమైన కెరియర్ను విదితపరిచారు.
ఎంతో అంకితభావంతో కూడిన తన ఉద్యోగ జీవితంతో వ్యక్తిగత జీవితం చాలా ప్రభావితమయ్యేదని, ఎల్అండ్టీ ఆఫీసులో ఆలస్యమైన ప్రతిరోజూ ఇంట్లో తన భార్య ఒక్కరే ఉండేదని నాయక్ తెలియజేశారు. చాలాసార్లు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆఖరి బస్సు మిస్సయ్యేదని, అప్పుడు ఆఫీస్ టేబుల్పైనే పడుకొనేవాడినని చెప్పారు. ఎల్అండ్టీలో నన్ను ఉద్యోగంలోకి తీసుకున్న బార్కర్.. రెండేండ్ల తర్వాత తనకో స్కూటర్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. అంతేగాక వీలైనంత త్వరగా తనకో కారును ఇవ్వాలని ఆయనెంతో శ్రమించారన్నారు. కంపెనీ కోసం తాను ఏం చేయగలనో అది చేయడం వల్లే ఈరోజు ఇలా ఉన్నానని వివరించారు. నా పనిని నేను ప్రేమించడం వల్లే ఇంత విజయాన్ని, గుర్తింపును అందుకోగలిగానని నేటి తరానికి సందేశమిచ్చారు. జాతి నిర్మాణంలో దేశానికి ఓ వేదికను అందించాలనుకున్నాను అంటూ ఎల్అండ్టీ కీర్తిని చెప్పకనే చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆయన్ను పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించాయి. ఎల్అండ్టీ వ్యాపార విస్తరణలో వెన్నెముకలో నిలిచిన నాయక్.. వచ్చే నెల 30న చైర్మన్ పదవి నుంచి దిగిపోనున్నారు. 1942 జూన్ 9న గుజరాతీ టీచర్ల కుటుంబంలో జన్మించిన నాయక్.. మెకానికల్ ఇంజినీరింగ్లో బీఈ చేశారు. 1965 మార్చి 15న జూనియర్ ఇంజినీర్గా ఎల్అండ్టీలో చేరారు. 1986లో జనరల్ మేనేజర్గా, 1999లో సీఈవో, ఎండీగా, 2003లో చైర్మన్గా ఎన్నికయ్యారు. నాయక్కు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.
‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక ఇతర కార్యకలాపాలతో బిజీగా ఉండేవాడిని. ఎప్పుడో ఓసారి మాత్రమే తరగతులకు హాజరయ్యేవాడినంటే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఓ అధ్యాపకుడు తరగతి గదిలో నాతో అన్న మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. పదో తరగతిలో మంచి మార్కులతో పాసైన వ్యక్తి.. కాలేజీలో అదే స్థాయిలో విద్యనభ్యసిస్తాడనుకోవద్దు అంటూ నన్ను అందరికీ ఆయన చూపించారు’ అంటూ గతాన్ని నాయక్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక విద్యార్థి జీవితం ముగిసిపోయింది అనుకున్నాను. ఇప్పుడు కార్పొరేట్ జీవితాన్ని మొదలుపెట్టాలి.. అందుకు నన్ను నేను సన్నద్ధం చేసుకోవాలి అని తీర్మానించుకున్నాను. అలా అరుదుగా క్లాసులకు హాజరైన తాను.. 21 ఏండ్లపాటు ఒక్క సెలవు కూడా తీసుకోకుండా, రోజుకు 15 గంటలపాటు పనిచేశాను’ అని నాటి రోజులను మననం చేసుకున్నారు.