Net Direct Tax Collection | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో రూ.10.64 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల్లో ఇది 58.34 శాతం. గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే 2023-24 తొలి ఎనిమిది నెలల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.4 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్-నవంబర్ మధ్య 17.7 శాతం వృద్ధి చెంది రూ.12.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.18.23 లక్షల కోట్లు (వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను), పరోక్ష పన్ను వసూళ్లు రూ.15.38 లక్షల కోట్లు (జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు) ఉంటాయని కేంద్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. బడ్జెట్ అంచనాల సవరణ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.33.61 లక్షల కోట్ల వసూళ్ల లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు సుమారు 20 శాతం, పరోక్ష పన్ను వసూళ్లు ఐదు శాతం పెరుగుతాయని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య రూ.2.03 లక్షల కోట్ల ఐటీ రీఫండ్ చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. రీఫండ్ ఫెయిల్ అయిన వారి ఖాతాలకు పంపడం జరిగిందని వెల్లడించింది.