Hyderabad Lands | హైదరాబాద్లో భూముల కోసం దేశ, విదేశీ మదుపరులు పోటీపడుతున్నారు. కొంపల్లి, మేడ్చల్, షామీర్పేట్ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నట్టు ఓ తాజా జాతీయ స్థాయి నివేదికలో వెల్లడైంది.వచ్చే పదేండ్లలో ఇక్కడి పెట్టుబడులు ఐదింతలవుతాయన్న అంచనాలున్నట్టు చెప్తున్నారు మరి. స్థిరాస్తి మార్కెట్లో ప్రాపర్టీ ఏదైనాసరే కొనేందుకు సిద్ధంగా ఉన్నారని రియల్టీ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి.
‘రాబోయే కొద్ది సంవత్సరాల్లో భూముల్లో పెట్టుబడులు అనేవి బంగారు గనిని సొంతం చేసుకున్నట్టేననుకోవచ్చు. భూ నగదీకరణ అత్యుత్తమ రాబడులకు గొప్ప వేదికే. మీ పెట్టుబడులు ఆకర్షణీయమైన లాభాలను ఇస్తాయి. సంపదను రెట్టింపు చేయడంలో భూమిని మించిన సాధనం మరొకటి లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కాస్త ఓపికతో ఉంటే స్థిరమైన ఆదాయాన్ని అందుకోవచ్చు.
-నివేదికలో కొల్లీర్స్ ఇండియా
హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: స్థిరాస్తి మదుపరులకు హైదరాబాద్.. ఇప్పుడు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. భద్రత, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యాపార-పారిశ్రామిక కార్యకలాపాలు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం ఇలా ఏ రకంగా చూసినా అందరికి రాష్ట్ర రాజధాని మిన్నగా కనిపిస్తున్నది. ‘టాప్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్స్ ఇన్ ఇండియా’ పేరుతో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లీర్స్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక సైతం ఇదే చెప్తున్నది.
టాప్-5 కారిడార్లలో..
కొల్లీర్స్ ఇండియా రిపోర్టు ప్రకారం.. భూమిపై పెట్టుబడి కోసం టాప్-5 ఎమర్జింగ్ కారిడార్లలో హైదరాబాద్లోని కొంపల్లి-మేడ్చల్-షామీర్పేట్ ఉన్నది. మిగతా వాటిలో మహారాష్ట్రలోని నేరళ్-మాథేరన్, గుజరాత్లోని సనంద్-నల్సరోవర్, చెన్నై సమీపంలోని ఈసీఆర్-ఇంజాబక్కమ్-కోవళం, కోల్కతా దగ్గర్లోని న్యూ టౌన్-రాజర్హట్ ఉన్నాయి. ఇక్కడి భూముల్లో పెట్టుబడులు పెడితే వచ్చే దశాబ్ద కాలంలో ఐదు రెట్లు లాభాలను అందుకోవచ్చని మదుపరులు భావిస్తున్నట్టు కొల్లీర్స్ తెలిపింది.
భూముల తర్వాత..
భూముల్ని కొనేందుకే మొదటి ప్రాధాన్యతనిస్తున్న మదుపరులు.. ఆ తర్వాత ఇండ్లు, ఫ్లాట్లు, వీకెండ్ హోమ్స్, హాలిడే హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ ద్వారా అద్దె ఆదాయాన్ని పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారని కొల్లీర్స్ తెలిపింది. ప్రాపర్టీ ఆధారంగా వచ్చే ఆదాయం ఉంటున్నదని పేర్కొన్నది. ‘దేశంలోని మెట్రో నగరాలుసహా ఇతర ప్రధాన నగరాల్లో భూములు ఇప్పుడు హాట్కేకుల్లాగా మారిపోయాయి. ఫైనాన్షియల్, ఇండస్ట్రియల్ హబ్స్కు సమీపంలో మైక్రో -మార్కెట్లను ఈ భూములు సృష్టిస్తున్నాయి. స్మార్ట్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి భారీ డిమాండ్ ఉంటున్నది’ అని కొల్లీర్స్ తెలిపింది. మెట్రో సిటీల్లోని విల్లాలు, ఫా మ్హౌజ్లు, ప్లాట్లు, ఇతర భూములకు.. కరోనా తర్వాత 2 రెట్లు అధికంగా డిమాండ్ పెరిగిందని కొల్లీర్స్ ఇండియా డెలివరీ, అడ్వైజరీ సర్వీసెస్ అధిపతి ఉమాకాంత్ చెప్పారు