ముంబై, మార్చి 14: దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల సెంటిమెంట్, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు రూపాయిని పడగొట్టాయి. మంగళవారంనాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ కరెన్సీ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ ఒక్కసారిగా 14 పైసలు నష్టపోయి 82.37 వద్ద ముగిసింది. ఈ నెల 3వ తేదీ తర్వాత ఈ స్థాయికి రూపాయి దిగజారడం ఇదే ప్రధమం. దేశీయ కరెన్సీ క్షీణించడం వరుసగా ఇది రెండవ రోజు. సోమవారం ఇది 17 పైసలు తగ్గి 82.23 వద్ద క్లోజయ్యింది.
గత శుక్రవారం మినహా మిగిలిన నాలుగు రోజుల్లో రూపాయి 45 పైసలు పతనమయ్యింది. విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి ఈ ఒక్కరోజే రూ.3,087 కోట్ల షేర్లను విక్రయించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభ ప్రభావం ఆసియాలో వ్యాపించవచ్చన్న అంచనాలతో రూపాయి ఒడిదుడుకులకు లోనవుతుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు. వచ్చే ట్రేడింగ్ సెషన్లలో ఇది 82.20-82.75 శ్రేణి మధ్య కదలవచ్చని అంచనా వేశారు.