కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ బాట పట్టిస్తున్నది. గత ప్రభుత్వాల కంటే జోరుగా పీఎస్యూలను అమ్మడానికి పరుగులు పెడుతున్నది. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రూ.4లక్షల కోట్ల విలువైన వాటాలను అమ్మేసింది.ఎయిర్ ఇండియా వంటి ఎన్నో సంస్థలు కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణతో ప్రభుత్వానికి దూరమయ్యాయి.
న్యూఢిల్లీ, మార్చి 11: ఒకప్పుడు అన్ని రంగాల్లో విస్తరించిన ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లు.. ఇప్పుడు ఆనవాళ్లే లేకుండాపోయే ప్రమాదంలో పడ్డాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పీఎస్యూలను శరవేగంగా ప్రైవేట్పరం చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి 100కుపైగా సంస్థల్లో వాటాలను విక్రయించింది. మరికొన్ని సంస్థలను మొత్తానికే కార్పొరేట్లకు అప్పగించింది. ఇందులో ఎయిర్ ఇండియా కూడా ఒకటి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్నూ ఇలాగే ప్రైవేట్బాట పట్టించాలని చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 8 ఏండ్లలో రూ.4లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థల వాటాలు ప్రైవేట్ సంస్థల గుప్పిట్లోకి వెళ్లిపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ భూముల అమ్మకానికి..ప్రభుత్వ భూముల నగదీకరణ కోసం ఓ స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేసేందుకూ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవలే దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా వచ్చింది. ప్రైవేటీకరిస్తున్న, మూతబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలకు చెందిన భవనాలు, మిగులు భూముల నిర్వహణ, అమ్మకానికి ఈ కొత్త కంపెనీని మోదీ సర్కారు తీసుకొస్తున్నది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) పేరుతో వస్తున్న ఈ ఎస్పీవీని రూ.5,000 కోట్ల ఆరంభ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, రూ.150 కోట్ల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్తో కేంద్రం ఏర్పాటు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)లు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ఆధ్వర్యంలోని భూములు, భవనాలను స్వాధీనం చేసుకుని ఎన్ఎల్ఎంసీ అమ్ముతుంది.
ఐపీవోకు ఎల్ఐసీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, దేశీయ అతిపెద్ద సంస్థాగత మదుపరి.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోనూ కేంద్ర ప్రభుత్వం వాటాలను విక్రయిస్తున్నది. స్టాక్ మార్కెట్లలోకి ఎల్ఐసీ ప్రవేశానికి కావాల్సిన అన్ని పనులనూ మోదీ సర్కారు వేగంగా జరిపించేస్తున్నది. తొలుత 5 శాతం వాటాను అమ్మేయాలని చూస్తుండగా, ఖజానాకు రూ.60,000 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో ఈ ఐపీవో ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ఈ నెలాఖర్లోగా పబ్లిక్ ఇష్యూను తేవాలనే కేంద్రం చూస్తున్నది. కానీ ప్రతికూలతల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరాని (2022-23)కి వాయిదా పడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తదుపరి ఇష్యూల్లోనూ భారీగానే ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు కేంద్రం దిగవచ్చని తెలుస్తున్నది.