హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): సమర్థ నీటి వినియోగంలో మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి అత్యుత్తమ యూనిట్గా జాతీయ అవార్డు లభించింది. కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో గురువారంరాత్రి న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ థర్మల్ ప్లాంట్లకు జాతీయస్థాయి బహుమతులు అందజేశారు.
ఇందులో సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి బెస్ట్ నేషనల్ వాటర్ ఎఫిషియంట్ యూనిట్ అవార్డు లభించింది. 500 మెగావాట్ల పైబడిన సామర్థ్యం గల సుమారు 150 ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలలో సింగరేణి ప్లాంటు ఈ అవార్డును సాధించడం పట్ల సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, డైరెక్టర్ డీ సత్యనారాయణరావు హర్షం వ్యక్తం చేశారు.
సాధారణంగా థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పాదనకు గరిష్ఠంగా మూడు ఘనపు మీటర్ల నీటిని వినియోగించడాన్ని ప్రామాణికంగా భావిస్తారు. కానీ థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఈ ప్రమాణాన్ని దాటే నీటిని వినియోగిస్తుంటారు. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రంలో తీసుకున్న ప్రత్యేక చర్యలు, వినియోగిస్తున్న సాంకేతికత వలన ఒక గంటలో ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పాదనకు నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా అంటే.. 2.8 ఘనపు మీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నారు.
దీనితో జాతీయ స్థాయి అవార్డుకు సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ఎంపికచేశారు. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోబిన్ సిస్టంను వినియోగించడం వల్ల నీటి వినియోగం తక్కువగా ఉంటున్నది. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం తరఫున అధికారులు కే చంద్రలింగం, ఎల్జేవీ సుబ్బారావు ఈ అవార్డును అందుకున్నారు.