హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యాకలాపాలు అందిస్తున్న నాట్కో ఫార్మా ఇతర సంస్థలపై దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రెండు నుంచి మూడు చిన్న స్థాయి సంస్థలను కొనుగోలు చేయాలనుకుంటున్నది. గడిచిన త్రైమాసికానికిగాను జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించింది.
ఇందుకోసం ఎంత మొత్తం నిధులను వెచ్చించనున్నదో మాత్రం వెల్లడించలేదు. కాన్ఫరెన్స్ కాల్లో కంపెనీ సీఈవో రాజీవ్ నన్నపనేని మాట్లాడుతూ..ఈ ఏడాది ఆర్అండ్డీ, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు, విదేశాల్లో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గడిచిన రెండేండ్లుగా భారత్లో కంపెనీ వ్యాపారం ఆశావాదంగా ఉన్నదని, గతేడాది రూ.400 కోట్ల విక్రయాలు జరిపినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఆంకాలజీ చికిత్సకోసం వినియోగించే ఔషధాలకు డిమాండ్ పెరిగిందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,043.80 కోట్ల ఆదాయంపై రూ.170 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కరోనా ఉత్పత్తుల కోసం రూ.232 కోట్ల నిధులను వెచ్చించడంతో లాభాల్లో గండిపడిందని పేర్కొంది.