బెంగళూరు: రోబోటిక్ ఆటోమేషన్ వల్ల ఐటీ రంగంలో వచ్చే ఏడాది (2022) నాటికి 30 లక్షల మంది నిపుణులు ఉద్యోగాలు కోల్పోతారని వచ్చిన వార్తలను నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) కొట్టి పారేసింది.
2020-21లో దేశీయ ఐటీ కంపెనీలు 1.38 లక్షల మంది నిపుణులను నియమించుకున్నాయని నాస్కామ్ శుక్రవారం వివరణ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని టాప్-5 కంపెనీలు కొత్తగా 96 వేల మందికి పైగా నియమించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాయని తెలిపింది.
వచ్చే ఏడాది చివరికల్లా భారత్ ఐటీ సంస్థలు 30 లక్షల మంది ఉద్యోగాలను తొలగించనున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదించింది. దీంతో ఏటా 100 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయని ఆ బ్యాంక్ పేర్కొన్న నేపథ్యంలో నాస్కామ్ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్తగా 96 వేల మందిని నియమించుకోవడంతోపాటు 2.50 లక్షల మందికిపైగా ఉద్యోగుల్లో డిజిటల్ నైపుణ్యాలను ఐటీ సంస్థలు పెంపొదిస్తున్నాయని నాస్కామ్ వివరించింది. 40 వేలమందిని డిజిటల్ నిపుణులను నియమించిందని తెలిపింది.
దేశంలో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) రంగంలో14 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆటోమేషన్లో కీలకమైన ఐటీ-బీపీఎంలో ఈ ఏడాది మార్చి నాటికి 45 లక్షల మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు.