Narayana Murthy | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశ యువత వారంలో 70గంటలు పని చేయాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మరికొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. తాజాగా ఆయన మరోసారి పని గంటలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. తాను ఇన్ఫోసిస్లో వారంలో 85-90 గంటలు పని చేసిన సందర్భాలున్నాయన ఆయన.. ఆ కష్టం వ్యర్థం కాలేదన్నారు.
కంపెనీని స్థాపించిన సమయంలో వారానికి 70గంటలు అంతకంటే ఎక్కువ సమయం పని చేశానని చెప్పారు. 1994 వరకు వారానికి 85 నుంచి 90 గంటలు పని చేశానన్నారు. వారంలో ఆరు పనిదినాలు ఉండేవన్నారు. ఉదయం 6.20 గంటలకు ఆఫీసుకు చేరుకుంటే.. రాత్రి 8.30 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయలుదేరేవాడినని తెలిపారు. నా 40సంవత్సరాలకుపైగా వృత్తి జీవితంలో.. వారానికి 70గంటలు పని చేశానని తెలిపారు. పేదరికం నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం చాలా కష్టపడి పని చేయడమేనని తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని.. తాను అవే పాటించానన్నారు.
ఇంతకు ముందు అక్టోబర్లో నారాయణ మూర్తి మోహన్దాస్ పాయ్తో జరిగిన ‘ది రికార్డ్ అనే పాడ్కాస్ట్’లో నారాయణ మూర్తి 70 పని గంటలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చైనా, జపాన్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో భారత్ పోటీపడాలంటే పని వేళలతో పాటు పని ఉత్పాదకతను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ప్రజలు తమ దేశాల అభివృద్ధిపై దృష్టి సారించాయని, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఆ దేశాల్లో అనేక వారాల పాటు అదనంగా గంటల పాటు పని చేశారన్నారు. భారత్లోనూ యువత పాటించాలని సూచించారు. నారాయణమూర్తి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించగా.. మరికొందరు స్వాగతించారు.