Narayana Murthy -Infosys | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన భవిష్యత్ ప్రణాళికలను బయట పెట్టారు. మిగతా తన జీవితం తన పిల్లలు, మనుమలతో గడిపేందుకు, సంగీతం వినేందుకు, ఫిజిక్స్ నుంచి ఎకనామిక్స్ వరకూ విభిన్న రకాల పుస్తకాలు చదివరేందుకు ప్లాన్ చేసుకున్నానని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాల్లోకి చేరేందుకు తనకు ఎటువంటి ప్రణాళికల్లేవని కుండబద్ధలు కొట్టారు.‘రాజకీయాల్లోకి రావాలంటే నేను వ్రుద్ధుడ్ని. నాకు ఇప్పుడు 78 ఏండ్లు’ అని రాజకీయాల్లో వస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రచయిత-దాత నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సైతం ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
‘ఇతరుల పట్ల గౌరవంగా ఎలా ఉండాలో నా పిల్లలకు ఆప్యాయంగా చెబుతాను. మన సమాజంలో ప్రజలు ఇప్పటికీ తమ మరుగుదొడ్లు శుభ్రం చేయడం తమ పని కాదన్నట్లు భావిస్తారు. ఈ విషయంలో నా పిల్లలకు ఒక విషయం చెబుతాను. అదేమిటంటే ఇతరులెవ్వరూ మనకంటే తక్కువ కాదు’ అని నారాయణ మూర్తి తెలిపారు. తమ ఇంట్లో బాత్రూమ్లు తమ పిల్లలే శుభ్రం చేసేలా ప్రోత్సహిస్తానని అన్నారు. ఇప్పటికీ సంపన్న కుటుంబాల్లో స్వయంగా మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడం నిషిద్ధం’ అని చెప్పారు. ‘నా పిల్లలు చాలా ఆసక్తిగా ఉంటారు. వారు చాలా ప్రశ్నలతో ఎదురు చూస్తుంటారు. ఏ ఒక్కరినీ మనకంటే తక్కువగా చూడొద్దు అని వారికి చెబుతుంటాను’ అని అన్నారు.