హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): వచ్చే 25 ఏండ్లలో సహకార బ్యాంకుల్లో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ (నాఫ్స్కాబ్-ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు తెలిపారు. చెన్నై నగరంలో నాఫ్స్కాబ్ ఆధ్వర్యంలో కొండూరు రవీందర్రావు అధ్యక్షతన శుక్రవారం ఒకరోజు జాతీయ సదస్సు జరిగింది. రాబోవు 25 ఏండ్లలో సహకార సంస్థల అభివృద్ధి, రుణాల మంజూరు, సభ్యులకు అందించే సేవల్లో వాటి పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగిందని చెప్పారు.
2,047 నాటికి సహకార బ్యాంకులు మరింత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, నిర్వహణ, సాంకేతిక వినియోగంలో యువతను భాగస్వామ్యం చేయాలని కోరుతూ సదస్సులో తీర్మానించినట్టు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళనాడు సహకార మంత్రి తిరు కేఆర్ పెరియకురుప్పన్ ముఖ్య అతిథిగా హాజరవగా, టెస్కాబ్ ఎండీ డాక్టర్ నేతి మురళీధర్, తెలంగాణలోని పలువురు జిల్లా సహకార బ్యాంకుల అధ్యక్షులు పాల్గొన్నారు.