ముంబై, మార్చి 8: దేశంలో అత్యధిక మంది జీవిత బీమా ఉండాల్సిందే అంటున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (ఎల్ఐసీ) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం జీవిత బీమాను కొనడం చాలా అవసరమని దాదాపు 91 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో జీవిత బీమాను పెట్టుబడిగా 70 శాతం మందే చూస్తున్నట్టు తేలింది. జీవిత బీమాపై ఉన్న అవగాహనను తెలుసుకోవడానికి 40 నగరాల్లోని 12,000 మందిని ఎల్ఐసీ సర్వే చేసింది. ఈ క్రమంలోనే పైవిధంగా ఫలితాలు వెలువడ్డాయి. జీవిత బీమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఎల్ఐసీలో ఆయా సంస్థలకు సభ్యత్వం ఉన్నది. దీంతో ఈ సర్వే సహజంగానే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
కరోనాతో పెరిగిన పాలసీలు
కరోనా వైరస్ నేపథ్యంలో జీవిత బీమా పాలసీలు గణనీయంగా పెరిగినట్టు సర్వే గుర్తించింది. చాలా మంది జీవిత బీమాను కొన్నారని తేలింది. అయినప్పటికీ ఇంకా జీవిత బీమా కొనుగోలుకున్న ప్రాముఖ్యం గురించి అవగాహన పెరగాల్సిన అవసరం ఉన్నదని సర్వే అభిప్రాయపడింది. కాగా, సర్వేలో పాల్గొన్నవారిలో 71 శాతం మంది ఇప్పటికే జీవిత బీమాలను కలిగినవారో లేక కొనేందుకు ఆసక్తి కనబరిచినవారో ఉన్నారు. ఇక భవిష్యత్తులో ఆర్థిక భద్రత, కుటుంబ ఆర్థిక లక్ష్యాల సాధన కోసమే జీవిత బీమాలను కొంటున్నట్టు అత్యధికులు చెప్పారు.
పెట్టుబడికి అడ్డంకులివి..
జీవిత బీమాను మదుపరులు పెట్టుబడిగా చూడకపోవడానికి రెండు ప్రధాన కారణాలున్నట్టు సర్వే పేర్కొన్నది. దీర్ఘకాల స్వభావం ఉండటం, ఖరీదెక్కువ అని భావించడమే ఇందుకు కారణమని చెప్పింది. కాగా, దేశంలోని పశ్చిమాది రాష్ర్టాల మార్కెట్లో చాలామంది యువకులు, మిల్లేనియల్స్.. లైఫ్ ఇన్సూరెన్స్పై అవగాహనను కలిగి ఉండటమేగాక, పెట్టుబడులకూ సుముఖత వ్యక్తం చేస్తున్నారని సర్వే వెల్లడించింది. ఈక్విటీ షేర్లలోనూ వీరి పెట్టుబడులు 45 శాతంగా ఉన్నాయని, అన్ని జోన్లతో పోల్చితే ఇదే ఎక్కువని స్పష్టం చేసింది. అహ్మదాబాద్, ముంబై, పుణెల్లో 92 శాతం మంది జీవిత బీమా ముఖ్యమని స్పష్టం చేశారు.
బీమాకే తొలి ప్రాధాన్యం
జీవిత బీమాకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నట్టు సర్వే తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 96 శాతం మంది జీవిత బీమాపట్ల అవగాహనతో ఉన్నారని చెప్పింది. ఇతర ఆర్థిక సాధనాల్లో జీవిత బీమా తర్వాత మ్యూచువల్ ఫండ్స్ (63 శాతం), ఈక్విటీ షేర్లపై (39 శాతం) అవగాహనను ఎక్కువగా కలిగి ఉన్నారని పేర్కొన్నది. ఇదిలావుంటే 36 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్నవారే జీవిత బీమాను కలిగి ఉన్నారు. అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారానే బీమాను కొంటామని సర్వేలో పాల్గొన్నవారిలో సగానికిపైగా మంది ఆసక్తి చూపించడం విశేషం.