న్యూఢిల్లీ, డిసెంబర్ 29: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ.. తన కొడుకులు, కూతురు కోసం వ్యాపార లక్ష్యాలను నిర్దేశించారు. ఇప్పటికే పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ టెలికం, డిజిటల్ వ్యాపారాలు చూస్తున్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ చేతికి న్యూ ఎనర్జీ బిజినెస్ పూర్తిస్తాయిలో రాబోతున్నది. మరోవైపు కూతురు ఇషా అంబానీకి రిటైల్ వ్యాపార పగ్గాలు అందిన సంగతి విదితమే. ఈ క్రమంలో బుధవారం జరిగిన ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’లో వారసులకు ముకేశ్ అంబానీ తదనుగుణంగా లక్ష్యాలను నిర్ణయించారు.
ఈ మేరకు ముకేశ్ అంబానీ ప్రసంగాన్ని మీడియాకు గురువారం ఆ సంస్థ విడుదల చేసింది. 104 బిలియన్ డాలర్ల విలువైన ఆర్ఐఎల్ వ్యాపారాలను టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ అనే మూడు ప్రధాన వర్గాలుగా విభిజించి.. ఒక్కోదాని బాధ్యతను తన ముగ్గురు సంతానంలో ఒక్కొక్కరికి ఇస్తున్నట్టు ముకేశ్ అంబానీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టెలికం, రిటైల్ వ్యాపారాలను కవలలైన ఆకాశ్, ఇషాలు చూస్తున్నారు. నిజానికి గత ఏడాది రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగానే తన వారసత్వ ప్రణాళికపై తొలిసారి ముకేశ్ స్పందించారు. కాగా, ముకేశ్ తండ్రి, రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు డిసెంబర్ 28ని రిలయన్స్ ఫ్యామిలీ డేగా ఏటా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఏడాదిలోగా అంతటా 5జీ
దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి 5జీ మొబైల్ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చే దిశగా రిలయన్స్ జియో ముందుకెళ్లాలని ముకేశ్ అంబానీ నిర్ణయించారు. అలాగే రిటైల్ రంగంలో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను అందుకుంటామన్న విశ్వాసాన్నీ కనబర్చారు. ఈ క్రమంలోనే తన ముగ్గురు పిల్లల నాయకత్వంలో రిలయన్స్ గ్రూప్ గొప్పగా అభివృద్ధి చెందుతున్న ధీమాను వ్యక్తం చేశారు. ఆకాశ్ అంబానీ నాయకత్వంలో జియో, ఇషా సారథ్యంలో రిటైల్ వ్యాపారాలు నూతన శిఖరాలను అధిరోహిస్తాయన్నారు. ఇక న్యూ ఎనర్జీ బిజినెస్.. అనంత్ రాకతో కొత్త బలాన్ని అందిపుచ్చుకోగలదన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.
లీడర్షిప్, టీమ్వర్క్తోనే..
వ్యాపారంలో విజయం అనేది నాయకత్వం, సమష్ఠి కృషితోనే సాధ్యమని ముకేశ్ అంబానీ అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి ఫుట్బాల్ ప్రపంచ కప్లో అర్జెంటీనా జట్టు, దాని నాయకుడు మెస్సీ ఆటతీరును ఉదహరించారు. మెస్సీ ఒక్కడి వల్లే అర్జెంటీనాకు ఫుట్బాల్ ప్రపంచ కప్ రాలేదని, అలాగే ఆ దేశ జట్టు కూడా మెస్సీ లేనిదే ఇంతటి విజయాన్ని సాధించేది కాదని చెప్పుకొచ్చారు. అర్జెంటీనా జట్టుకు మెస్సీ ఎంత బలమో, మెస్సీకి కూడా ఆ జట్టు అంతే బలమన్నారు. అలాగే ప్రతీ వ్యాపారం కూడా దాని యాజమాన్యం, ఉద్యోగులు కలిసి పనిచేస్తేనే రాణిస్తుందని పేర్కొన్నారు. రిలయన్స్ గ్రూప్ నిర్మాణంలో ధీరూభాయ్ అంబానీ చేసింది ఇదేనని కొనియాడారు. ఇక తనకు తన తండ్రి ధీరూభాయ్ అంబానీ, స్వామీ వివేకానంద ఆలోచనలు ఆదర్శమని చెప్పారు. కేవలం ఒక్క ఆలోచన కోసమే తపించి, శ్రమించి, జీవించాలని.. అప్పుడే విజయం సొంతమవుతుందని స్వామీజీ చెప్పినట్టు ముకేశ్ గుర్తుచేశారు.
రాధికతో అనంత్ పెండ్లి
ముకేశ్ చిన్న కొడుకు అనంత్ అంబానీకి.. పారిశ్రామికవేత్త, ఎన్కోర్ హెల్త్కేర్ సీఈవో విరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్తో పెండ్లి జరుగబోతున్నది. ఈ మేరకు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించాయి. రాజస్థాన్లోని నాథ్ద్వారాలోగల శ్రీనాథ్జీ ఆలయంలో గురువారం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య అనంత్, రాధికల ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే వివాహం ఎప్పుడన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.
రిలయన్స్ చేతికి లోటస్
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న లోటస్ చాకోలెట్లో మెజారిటీ వాటాను రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) దక్కించుకుంటున్నది. ఈ మేరకు లోటస్ చాకోలెట్ ప్రమోటర్లు, ఆర్సీపీఎల్ మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ప్రమోటర్లు ప్రకాశ్ పాయ్, అనంత్ పాయ్ తదితరుల నుంచి, ఓపెన్ ఆఫర్ ద్వారా 77 శాతం వాటాను ఆర్సీపీఎల్ అందుకుంటుంది. చాకోలెట్లు, కోకో ఉత్పత్తులు, కోకో డెరివేటివ్స్ను లోటస్ సంస్థ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆర్ఐఎల్ ఎఫ్ఎంసీజీ విభాగమే ఈ ఆర్సీపీఎల్.
‘ఏండ్లు, దశాబ్దాలు గడుస్తూనే ఉంటాయి. రిలయన్స్ ఎదుగుదల కొనసాగుతూనే ఉంటుంది. ఓ మర్రి చెట్టు ఎలాగైతే శాఖోపశాఖలుగా విస్తరిస్తుందో.. బలంగా వేళ్లూనుకుంటుందో.. అలాగే రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం కూడా వృద్ధి చెందుతుంది. దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి అవసరాలను తీర్చుతూ ముందుకు సాగుతుంది’
-ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ అధినేత