Reliance @ Forbes Global | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో చోటు దక్కించుకున్నది. వార్షిక ఆదాయం 100 బిలియన్ డాలర్లకు పైగా సాధించిన సంస్థగా ఫోర్బ్స్ గ్లోబల్ లిస్ట్లో చేరింది. భారత్ జాబితాలో తొలి వరుసలో నిలిచింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్య రిలయన్స్ ఆదాయం 104.6 బిలియన్ డాలర్లు. ఇంతకుముందు స్థానంతో పోలిస్తే రెండు స్థానాలు పైకి ఎగబాకి 53వ ర్యాంక్ పొందింది. భారత్ కంపెనీల జాబితాలో దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ చోటు దక్కించుకున్నది. ఈ జాబితాలో భారత్ నుంచి కొత్తగా చోటు దక్కించుకున్న వాటిలో గౌతం అదానీ సారధ్యంలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్
ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)
హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్),
టాటా స్టీల్,
యాక్సిస్ బ్యాంక్
ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయి అంబానీ 1960వ దశకం ప్రారంభంలో వ్యాపారం ప్రారంభించారు. నైలాన్, రేయాన్, పాలిస్టర్ దుస్తుల ఎగుమతి, దిగుమతులతో వ్యాపార లావాదేవీలు మొదలు పెట్టింది రిలయన్స్. ఈ నాడు ప్లాస్టిక్, పెట్రో కెమికల్స్, మొబైల్ టెలికం సర్వీసెస్, రిటైల్ రంగాలకు విస్తరించిందని ఫోర్బ్స్ పేర్కొంది.
భారత్ కంపెనీల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ 56.12 బిలియన్ డాలర్లు. దేశవ్యాప్తంగా 24 వేల శాఖలు, 62,617 ఏటీఎం కేంద్రాలు గల బ్యాంక్ ఇది. ప్రైవేట్ బ్యాంక్ల్లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం భారత్లో బ్యాంకింగ్ రంగ వృద్ధిరేటును తెలియజేస్తున్నది.
ఫోర్బ్స్ గ్లోబల్ లిస్ట్లో భారత్ సంస్థల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఎస్బీఐ.. అంతర్జాతీయ సంస్థల జాబితాలో 105వ ర్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 153, ఐసీఐసీఐ బ్యాంక్ 204 ర్యాంక్ సాధించాయి.