ముంబై: సంచలనాల రిలయెన్స్ జియో ఈ ఏడాది వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త నినాదంతో వచ్చింది. గతేడాది భారత్ను 2జీ ముక్త్ చేస్తామని ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు 5జీ యుక్త్ను దానికి జోడించింది. గురువారం వర్చువల్గా జరిగిన సంస్థ 44వ ఏజీఎంలో పూర్తి మేడిన్ ఇండియా 5జీ టెక్నాలజీ సిద్ధంగా ఉన్నదని రిలయెన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఇండియాలో 5జీ సేవలను తీసుకురానున్న తొలి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్గా జియో నిలవనుందని చెప్పారు. ట్రయల్స్లో భాగంగా తాము 5జీ టెక్నాలజీ కోసం 1 జీబీపీఎస్ కంటే కూడా ఎక్కువ స్పీడ్లను విజయవంతంగా రన్ చేసినట్లు జియో స్పష్టం చేసింది.
మా మేడిన్ ఇండియా పరిష్కారం సమగ్రమైనది, పూర్తి స్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ పోటీదారు కూడా. ఇలాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్లను మన ఇంజినీర్లు తయారు చేయగలరని మరోసారి రుజువైంది. ఈ మధ్యే మాకు రెగ్యులేటరీ అనుమతులు కూడా మంజూరయ్యాయి అని ముకేశ్ అంబానీ చెప్పారు. దేశంలోని తమ అన్ని డేటా సెంటర్లలో 5జీ స్టాండలోన్ నెట్వర్క్ను ఇన్స్టాల్ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా మెరుగైన నెట్వర్క్ ఉన్నందున తాము 4జీ నుంచి 5జీకి చాలా సులువుగా మారేందుకు వీలుంటుందని అంబానీ చెప్పారు.
ఇన్నాళ్లూ హువావీలాంటి థర్డ్ పార్టీ వెండార్లపై ఆధారపడుతున్న తాము సొంతంగా 5జీ టెక్నాలజీని తయారు చేస్తున్నట్లు గతేడాది రిలయెన్స్ జియో ప్రకటించింది. ఈ సందర్భంగా తాము 2జీ ముక్త్ భారత్ను కోరుకుంటున్నట్లు చెప్పింది. తాజాగా ఈ ఏజీఎంలో దానికి 5జీ యుక్త్ అనే మరో నినాదాన్ని జోడించింది.