Mukesh Ambani | న్యూఢిల్లీ, అక్టోబర్ 10: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ దేశీయ శ్రీమంతుడిగా అవతరించారు. 119.5 బిలియన్ డాలర్ల సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలి స్థానం దక్కించుకున్నారని ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాదికాలంలో ముకేశ్ సంపాదన 27.5 బిలియన్ డాలర్లు పెరిగి 119.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 13వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. గడిచిన ఏడాదికాలంలో గౌతమ్ అదానీ సంపద 48 బిలియన్ డాలర్లు పెరిగి 116 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. దేశీయ 100 మంది శ్రీమంతులు సంపద విలువ 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2023లో 799 బిలియన్ డాలర్లుగా ఉన్న వీరి సంపద 40 శాతం అధికమై ట్రిలియన్ డాలర్లు అధిగమించింది. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది.
ఫోర్బ్స్ 2024 సంవత్సరానికిగాను విడుదల చేసిన జాబితాలోకి కొత్తగా ఇద్దరు తెలుగువాళ్లు ప్రవేశించారు. వీరిలో హెటిరో గ్రూపు ఫౌండర్ బీ పార్థ సారథి రెడ్డి ఉన్నారు. 3.85 బిలియన్ డాలర్ల సంపదతో 81వ స్థానంలో ఉన్నారు. అలాగే బయోలాజిక్ ఈ అధినేత మహిమా దాట్లా 3.3 బిలియన్ డాలర్లతో 100వ స్థానంలో నిలిచారు.