Boots for Reliance | అంతర్జాతీయ డ్రగ్స్ స్టోర్స్ బూట్స్ టేకోవర్కు దాఖలు చేసిన బిడ్ నుంచి గుజరాతీ సంతతికి చెందిన ఈషా బ్రదర్స్ సారధ్యంలోని కన్సార్టియం వైదొలిగింది. వాల్గ్రీన్స్ ఆధ్వర్యంలోని బూట్స్ అలయెన్స్ బిడ్ ధర ఎక్కువ ఖరారు చేశారని ఈషా బ్రదర్స్ అన్నట్లు సమాచారం. టీడీఆర్ క్యాపిటల్తో కలిసి ఈషా బ్రదర్స్ బిడ్ వేశారు. ఆఫర్ ధర పెంచమని వాల్గ్రీన్స్ నుంచి విజ్ఞప్తి రావడంతో ఈషా బ్రదర్స్ వెనుకడుగు వేసినట్లు తెలుస్తున్నది. ఫలితంగా గురువారం న్యూయార్క్లోని స్టాక్ మార్కెట్లో వాల్గ్రీన్స్ షేర్లు 1.4 శాతం లాభంతో ముగిశాయి. దీంతో బూట్స్ డ్రగ్స్ స్టోర్ను ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ టేకోవర్ చేసుకోవడానికి మార్గం సుగమమైందని తెలుస్తున్నది.
అయితే, ఇప్పటికీ పరిస్థితి సంక్లిష్టంగానే ఉంది. బిడ్ ధరపై రాజీ పడితే ఈషా బ్రదర్స్ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ గ్రూప్ రేసులో ఉన్నట్లేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బూట్స్ డ్రగ్ స్టోర్ ధర 8.8 బిలియన్ల డాలర్లు (7 బిలియన్ల పౌండ్లు) అని చెబుతున్నారు. బిడ్డర్లు మాత్రం సుమారు 5 బిలియన్ల పౌండ్లకు టెండర్లు దాఖలు చేస్తారని సమాచారం. ఈ పరిస్థితుల్లో కొందరు బిడ్డర్లు చర్చల దశలోనే వైదొలిగే అవకాశాలు లేకపోలేదు. దీనిపై స్పందించడానికి ఈషా-టీడీఆర్ కన్సార్టియం నిరాకరించింది.
బూట్స్ డ్రగ్స్ స్టోర్ కోసం బిడ్ దాఖలు చేసిన రెండు సంస్థల్లో ఈషా-టీడీఆర్ గ్రూప్ ఒకటి. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్తో కలిసి బిడ్ దాఖలు చేసింది. అయితే రెండో దఫా బిడ్ ఇంకా వేయలేదని సమాచారం. బూట్స్ కోసం స్యాకామోర్ పార్టనర్స్ కూడా ఇంతకుముందు ఆసక్తి చూపాయి.