Reliance | యంత్రాల కంటే ప్రతిభపై పెట్టే పెట్టుబడితోనే అధిక ఆదాయం లభిస్తుందని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ గ్రూప్ ఫౌండర్ ధీరూభాయి అంబానీ 91వ జయంతి సందర్భంగా గురువారం జరిగిన ‘రిలయన్స్ ఫ్యామిలీ డే‘ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్.. మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించడంతోపాటు.. గ్లోబల్ మార్కెట్లో టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఒకటిగా నిలుస్తుందని అన్నారు. కస్టమర్ల అభిప్రాయాలకు విలువ ఇస్తూ, సర్వీసులు అందించడంలో వారి అంచనాలను అందుకోవాలని సిబ్బందికి ముకేశ్ అంబానీ పిలుపునిచ్చారు. నిత్యం కస్టమర్ల మనస్సు గెలుచుకోవడానికి సిబ్బంది తమ శక్తి సామర్థ్యాలను మెరుగు పర్చుకోవాలన్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో టాలెంట్, మనీతోపాటు టెక్నాలజీ కూడా ముఖ్యమైన అంశంగా మారిందని ముకేశ్ అంబానీ చెప్పారు. వచ్చే ఏడాది అన్ని వ్యాపార విభాగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సేవలను అంది పుచ్చుకోవాలన్నారు. డిజిటల్ డేటా వేదికలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అంది పుచ్చుకుని వ్యాపార రంగంలో ‘గ్లోబల్ లీడర్’ గా రిలయన్స్కు సుస్థిర స్థానం కల్పించడమే తమ లక్ష్యం అన్నారు.