Mukesh Ambani | ప్రపంచంలోనే సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరు ముకేశ్ అంబానీ.. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. రూ.16 లక్షల కోట్లకు పైగా విలువ గల వ్యాపార సామ్రాజ్యాన్ని తదుపరి తరానికి అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయి అంబానీ మరణం తర్వాత సోదరుడు అనిల్ అంబానీతో మాదిరిగా వాటాల పంపిణీకి తన కొడుకులు, కూతుళ్ల మధ్య వివాదం తలెత్త వద్దని ముకేశ్ అంబానీ భావిస్తున్నారు.
అందులో భాగంగా రిలయన్స్ జియో డైరెక్టర్గా ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాశ్ అంబానీని రిలయన్స్ జియో చైర్మన్గా నియమిస్తూ జియో డైరెక్టర్ల బోర్డు ఆమోద ముద్ర వేసింది.
రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరిస్తారు. సోమవారం జరిగిన జియో బోర్డు సమావేశంలో రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరిలను సంస్థ అదనపు డైరెక్టర్లు నియమిస్తూ తీర్మానం ఆమోదించింది. వారు 2022 జూన్ 27 నుంచి ఐదేండ్ల పాటు అదనపు డైరెక్టర్లుగా కొనసాగుతారు. మంగళవారం రిలయన్స్ షేర్లు 1.49 శాతం పుంజుకుని రూ.2,529 వద్ద ముగిశాయి.