న్యూయార్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సంపదలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్ అదానీ 83.9 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు. ఈ మేరకు ఫోర్బ్స్ సంస్థ రియల్ టైమ్ బిలియనీర్స్ -2023 జాబితాను వెల్లడించింది.
అంబానీ సంపద 0.19 శాతం వృద్ధితో 164 మిలియన్ డాలర్లు పెరుగగా, అదానీ సంపద 4.62 శాతం నష్టంతో 84.1 బిలియన్ డాలర్లు కరిగిపోయిందని ఫోర్బ్స్ పేర్కొన్నది. ఇటీవల హిండెన్ బర్గ్ నివేదిక అదానీ గ్రూప్లో లొసుగులను బయటపెట్టడంతో ఆ సంస్థ షేర్లు భారీ నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. దాంతో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 10వ స్థానానికి పడిపోయారు. అదానీ కంటే అంబానీ ఒక అడుగు ముందుకేసి 9వ స్థానంలో కొనసాగుతున్నారు.
కాగా, ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజమైన LVMH అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. టెస్లా, స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్, ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్, బెర్క్షైర్ హాత్వే చీఫ్ వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, టెలికాం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హేలు అండ్ ఫ్యామిలీ, గూగుల్ అధినేత లారీ పేజ్ వరుసగా మూడు నుంచి ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు.