Mukesh Ambani to Buy walmart | ఆసియా కుబేరుడు.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. సంస్థ సారధ్య బాధ్యతలను తన వారసులకు.. యువతరం భుజస్కంధాలపై పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. సంస్థలోని సీనియర్లు సహా ప్రతి ఒక్కరూ యువతరానికి బాధ్యతలు అప్పగించాలని ఇటీవల జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డే వేడుకలో సిబ్బందిని ముకేశ్ అంబానీ కోరిన సంగతి తెలిసిందే. దీనిపైనే కార్పొరేట్ ప్రపంచంలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే 64వ పడిలో పడిన ముకేశ్ అంబానీ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వారసులకు యాజమాన్య బాధ్యతలు అప్పగించాలని తలపోస్తున్నారు. ఇందుకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు సమాచారం.
2002లో తండ్రి ధీరూభాయి అంబానీ ఎటువంటి వీలునామా గానీ, సోదరులు ముకేశ్, అనిల్ అంబానీల మధ్య వ్యాపారాల విభజన చేయకుండానే కన్నుమూశారు. తర్వాత ముకేశ్, అనిల్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తి రిలయన్స్ విడిపోయింది. కానీ, తర్వాత ముకేశ్ అంబానీ సారధ్యంలో రిలయన్స్ పుంజుకుని అగ్రశ్రేణి సంస్థగా నిలిచింది. ఈ తరుణంలో తన సోదరుడు అనిల్ అంబానీతో మాదిరిగా ఆస్తుల వివాదాలు పునరావృతం కారాదని ముకేశ్ అంబానీ కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాల కథనం. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా.. రిలయన్స్ గ్రూప్ సంఘటితంగా ఉండేలా వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. రిలయన్స్ యాజమాన్య బాధ్యతల నిర్వహణకు ట్రస్ట్ వంటి వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నారు.
ఇద్దరు కొడుకులు ఆకాశ్, అనంత్, గారాల పట్టి ఈశా అంబానీల కోసం మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని మూడు భాగాలు విభించాలని ముకేశ్ అంబానీ యోచిస్తున్నారు. ఇందుకోసం మూడు సూపర్స్టార్ బిజినెస్లను ప్రారంభించబోతున్నారని వినికిడి. సంస్థ కార్పొరేట్ యాజమాన్య బాధ్యతలను వారసులకు అప్పగించే విషయమై కార్పొరేట్ వరల్డ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ముకేశ్ అంబానీ తన ప్లాన్లో భాగంగా ప్రముఖ రిటైల్ నెట్వర్క్ సంస్థ వాల్మార్ట్ ఇంక్
ను కొనుగోలు చేయనున్నారని వార్తలొచ్చాయి. దీన్ని తన వెల్త్ డివిజన్గా ఏర్పాటు చేసుకోనున్నారని ప్రముఖ వార్తా సంస్థ ఓ వార్తా కథనం ప్రచురించింది. దీని ఆధ్వర్యంలో ట్రస్ట్ తరహాలో కొలువు దీరే బోర్డులో ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీ సభ్యులుగా ఉంటారని సమాచారం. ఈ బోర్డు యావత్ రిలయన్స్ సామ్రాజ్యం వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తుందని వినికిడి.
ఇక రిలయన్స్ను ఆయిల్ అండ్ పెట్రో కెమికల్, టెలికం, రిటైల్ బిజినెస్గా విభజించడం బెటర్ ఆప్షన్ అని రిలయన్స్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ సంప్రదాయ ఇంధన బిజినెస్ నుంచి క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులేస్తున్నది. అందుకోసం క్లీన్ ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నది. రిలయన్స్ భారీగా నిధులు పెట్టగలిగితే చాలా ఎక్కువ సృష్టించడంతోపాటు లాభాలు గడించొచ్చు.
ఆయిల్ రిఫైనరీస్ లాభాలతో రిలయన్స్ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా జియోను ఏర్పాటు చేయగలిగింది. వచ్చే దశాబ్దాల్లో గ్రీన్ ఎనర్జీ, రిటైల్, డిజిటల్ బిజినెస్లు కీలకం కానున్నాయి. సెర్చింజన్ గూగుల్తో పార్టనర్షిప్ కల జియో ప్లాట్ఫామ్స్.. మున్ముందు మొబైల్ ఇంటర్నెట్, రిటైల్, న్యూ ఎనర్జీ రంగాల్లో బలమైన సంస్థగా ఆవిర్భవించనున్నది.
అయితే రిటైల్ రంగంపై పట్టు సాధించడం రిలయన్స్కు అంత తేలికేం కాదు. రిటైల్ రంగంలో గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి రిలయన్స్కు గట్టి పోటీ ఎదురవుతున్నది. ఫ్యూచర్ గ్రూప్ నెట్వర్క్ను రిలయన్స్ విలీనం చేసుకోకుండా అమెజాన్ నిలువరించగలిగింది.
అదే టైంలో న్యూ ఎనర్జీ.. క్లీన్ ఎనర్జీ రంగంలో గౌతం ఆదానీ నుంచి రిలయన్స్కు గట్టి పోటీ ఎదురు కానుంది. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించాలని గౌతం అదానీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ముకేశ్ అంబానీ కూడా వచ్చే మూడేండ్లలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 74.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు రూపొందించారు. పలు గ్రీన్ ఎనర్జీ రంగ సంస్థలను టేకోవర్ చేశారు కూడా.