Cyber Cheaters | రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పాలకులు, పోలీస్ అధికారులు ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చీటర్స్ మాత్రం మరో కొత్త పంథాను ఎంచుకుని తమ నేరాలను కొనసాగిస్తున్నారు. తాజాగా సైబర్ చీటింగ్ కోసం సెలెబ్రిటీల వివరాలను కూడా వాడుకున్న ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. ఓ సైబర్ చీటింగ్ ముఠా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల వివరాలతో క్రెడిట్ కార్డులు పొంది ఆర్థిక నేరాలకు పాల్పడింది.
బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి, మాధురీ దీక్షిత్, ఇమ్రాన్ హష్మీ, మహేంద్రసింగ్ ధోని లాంటి ప్రముఖుల వివరాలను సైబర్ నేరగాళ్లు వినియోగించుకున్నారు. వారి వివరాలతో క్రెడిట్ కార్డులను తీసుకుని లక్షల విలువచేసే వివిధ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. దాంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఐదుగురు నిందితులు.. పునీత్, మొహమ్మద్ ఆసిఫ్, సునీల్ కుమార్, పంకజ్ మిషార్, విశ్వ భాస్కర్ శర్మలను అరెస్ట్ చేశారు.
పోలీసులు విచారణలో వాళ్లు సెలెబ్రిటీల పేరుతో క్రెడిట్ కార్డులు పొందిన వివరాలు వెల్లడయ్యాయి. గూగుల్ నుంచి నిందితులు ప్రముఖుల జీఎస్టీఐఎన్ వివరాలను పొందేవారని, వాటిలో మొదటి రెండు అంకెల రాష్ట్రకోడ్ను వదిలేస్తే మిగిలిన 10 అంకెల పాన్కార్డ్ నెంబర్ ఉంటుందని, ఆ విధంగా సెలెబ్రిటీల పాన్
కార్డు వివరాలను పొందారని చెప్పారు.
ఇక సెలెబ్రిటీల డేట్ ఆఫ్ బర్త్ వివరాలను కూడా గూగుల్ నుంచే తీసుకున్నారు. ఇలా సెలెబ్రిటీల పాన్, ఆధార్ నంబర్లను వినియోగించి, వాటికి తమ ఫొటోలను జోడించి తప్పుడు కార్డులను సృష్టించారు. వీడియో కేవైసీలోనూ వారి సొంత వివరాలనే ఇచ్చారు. సెలెబ్రిటీల సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటుందని, దాంతో ఎక్కువ లిమిట్తో కార్డులు జారీ అవుతాయన్న ఉద్దేశంతో నిందితులు వారి పాన్, ఆధార్ నంబర్లను దొంగిలించారని తెలిపారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.