పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు జిల్లాలో పండుగలా కొనసాగుతున్నాయి. దీంతో ఊర్లన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రామాల్లో శుక్రవారం జోరుగా మొక్కలు నాటారు. గ్రామసభల్లో గుర్తించిన సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 2:నిజామాబాద్ రూరల్ మండలం ముత్తకుంట, ధర్మారం(ఎం), ధర్మారం తండా, శ్రీనగర్, గుండారం, సారంగాపూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను సరిచేయడం, కొత్తవి ఏర్పాటు చేయడం, వేలాడే విద్యుత్ తీగలను సరిచేయడం, వీధిదీపాలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. పాల్ద సబ్స్టేషన్ ప్రాంగణంలో పిచ్చిమొక్కలను తొలగించారు. ఆయాపనులను ఎంపీడీవో మల్లేశ్, ఎంపీవో మధురిమ, ఏవో హీరాజాదవ్, విద్యుత్ శాఖ ఏఈలు నవీన్రెడ్డి, రమేశ్, స్పెషల్ ఆఫీసర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. నగర పరిధిలోని కాలూర్ గ్రామంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ కోర్వ లలిత, నుడాడైరెక్టర్ ముస్కె సంతోష్ మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ మాజీ సర్పంచ్ కోర్వ గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు కోర్వ శ్రీనివాస్, తాడెం సాయిలు, స్వప్న, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ధర్పల్లి మండలంలో రెండోరోజు పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. రోడ్లు, వీధులను శుభ్రం చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు.
జక్రాన్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు వీధుల్లో తిరుగుతూ ప్రగతి ప్రణాళికను రూపొందించారు. తొర్లికొండ గ్రామంలో ఎంపీపీ డీకొండ హరిత పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గ్రామసభ నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కుంచాల విమల, మండల ప్రత్యేక అధికారి గోవింద్, ఎంపీడీవో లక్ష్మణ్, సూపరింటెండెంట్ బ్రహ్మానందం, ఎస్సై సాయారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బోధన్ మండలంలోని పెంటాకుర్దు, పెంటాకుర్దు క్యాంప్, సాలంపాడ్ క్యాంప్ గ్రామాల్లో కొనసాగుతున్న పల్లెప్రగతి పనులను ఎంపీపీ బుద్దె సావిత్రి పరిశీలించారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని అన్నారు. రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, సర్పంచులు శ్రీనివాస్రావు, వీరన్న, అంజమ్మ, ఎంపీటీసీ వెంకట్రావు, విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్, శివసాయిపటేల్ పాల్గొన్నారు. రెంజల్ మండలం దూపల్లిలో కూలీలు పిచ్చిమొక్కలను తొలగించారు. సాటాపూర్లో తహసీల్దార్ రామ్చందర్ మొక్కలు నాటగా, బోర్గాంలో ఎంపీపీ రజిని, జడ్పీటీసీ విజయ, ఎంపీడీవో గోపాలకృష్ణ పనులను పరిశీలించారు. ఎడపల్లి మండలకేంద్రంలోని నయాబాదితోపాటు పాత గ్రామంలో ప్రజాప్రతినిధులు విద్యుత్శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఎడపల్లి ఎంపీడీవో శంకర్, ఎంపీపీ శ్రీనివాస్, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కోటగిరి మండలం అడ్కాస్పల్లి, బస్వాపూర్ గ్రామాల్లో జడ్పీటీసీ శంకర్పటేల్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డి రామకృష్ణ, కోలి రేఖ, ఉపసర్పంచ్ శ్రీధర్, ఏఎస్వో రమేశ్, వినోద్, వెంకటి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.రుద్రూర్ మండలం అక్బర్నగర్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజీ గంగారాం పాల్గొని శ్రమదానం చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, నాగేందర్, సర్పంచ్ గంగామణి ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, ఎంపీడీవో బాలగంగాధర్, మారుతీగౌడ్, అశోక్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
చందూర్లో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలగించి డంపింగ్ యార్డుకు తరలించారు. రోడ్లకు ఇరువైపులా పిచ్చిమెక్కలను తొలగించారు. ప్రత్యేక అధికారి నజీర్ ఆయా పనులను పర్యవేక్షించగా, వైస్ ఎంపీపీ దశాగౌడ్, గ్రామ కార్యదర్శి సాయిలు, ఉప సర్పంచ్ శేఖర్, రాంరెడ్డి, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలోని ఎంపీడీవో దామోదర్ పల్లెనిద్ర చేశారు. శుక్రవారం తెల్లవారు జామునే నాగంపేట్, కొత్తపల్లి, వేంపల్లి గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. ఆయన వెంట వేంపల్లి ఉప సర్పంచ్ జక్క గంగాధర్ తదితరులు ఉన్నారు.