Gold Siege | రూ.1.58 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేశారు. మహారాష్ట్రలోని ఉల్హాస్నగర్ జ్యువెల్లరీ వ్యాపారితోపాటు ఐదుగురు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ముంబై-ఆగ్రా హైవేపై, ఇండోర్కు సమీపాన ఈ నెల 12న డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారులో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో మూడు కిలోల బంగారం బార్లు దాచిపెట్టినట్లు తేలింది. ఆ బంగారాన్ని జప్తు చేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో డీఆర్ఐ వెల్లడించింది.
ఈ కారులో వెళుతున్న నలుగురు వ్యక్తులు నేరాన్ని అంగీకరించారని డీఆర్ఐ పేర్కొంది. తమ సిండికేట్లో ఒకరైన ఆభరణాల వ్యాపారి ఆ బంగారం బార్లు సరఫరా చేశారని వారు చెప్పినట్లు కథనం. ఠాణే జిల్లా ఉల్లాస్నగర్లోని ఆ బంగారం వ్యాపారిని అరెస్ట్ చేసి, ఇండోర్కు తీసుకొచ్చారు. వీరిపై కస్టమ్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి, బంగారం జప్తు చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.