పుణె, సెప్టెంబర్ 23: దేశీయ ఐటీ రంగంలో ‘మూన్లైటింగ్’ చర్చ తీవ్రస్థాయిలోనే జరుగుతున్నది. ఇటీవల ఈ కారణంతోనే 300 మంది ఉద్యోగులను విప్రో తొలగించిన విషయమూ తెలిసిందే. అయితే దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ‘మూన్లైటింగ్’ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల తీరును తప్పుబడుతుంటే.. ప్రముఖ ఐటీ రంగ సంస్థ టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ మాత్రం సమర్థించడం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ‘సంస్థ ఉన్నతి, అభివృద్ధి కోసం కష్టపడుతున్న ఉద్యోగి.. తన ఆర్థిక అవసరాల కోసం ఆ సంస్థ విలువల్ని దెబ్బతీయకుండా, నిబంధనల్ని ఉల్లంఘించకుండా, యాజమాన్యాన్ని మోసగించకుండా మరో ఇతర సంస్థలో పని చేసుకుంటుంటే నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరి దగ్గరా దీన్ని దాచనవసరం లేదు’ అని గుర్నానీ ట్వీట్ చేశారు. కాగా, ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూనే.. అదే సమయంలో ప్రత్యర్థి సంస్థల కోసం కూడా పనిచేయడాన్నే ‘మూన్లైటింగ్’గా అభివర్ణిస్తున్నారు. దీన్ని ఐటీ కంపెనీలు అనైతికమంటున్నాయి. ఇన్ఫోసిస్, ఐబీఎం ఈ విషయమై తమ ఉద్యోగుల్ని హెచ్చరించినదీ తెలిసిందే.
ఆలోచనలు మారాయ్: రాజీవ్ చంద్రశేఖర్
యువ ఉద్యోగుల ఆలోచనలు, వైఖరులు, విశ్వాసాల్లో వస్తున్న లోతైన నిర్మాణాత్మక మార్పులను దేశీయ ఐటీ రంగ కంపెనీలు, కార్పొరేట్లు సరిగా అర్థం చేసుకోవడం లేదని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఉద్యోగుల కలలకు కళ్లెం వేసే ప్రయత్నాలు విఫలమే అవుతాయని తాజాగా ఓ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. నేడు ప్రతి ఉద్యోగికి తమ నైపుణ్యం, ప్రతిభపై ఎంతో విశ్వాసం ఉన్నదని, దానికి తగ్గ ప్రతిఫలాన్ని వారు ఆశిస్తున్నారని, అందుకే మెరుగైన అవకాశాలను నిత్యం అన్వేషిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో యాజమాన్యాలు ఉద్యోగులను తమ పనే చేయాలని, ఇక ఎక్కడా.. ఏ పనిపైనా దృష్టి పెట్టవద్దని వారించడం అవివేకమే అవుతుందని అభిప్రాయపడ్డారు. భారతీయ ఐటీ పరిశ్రమలో ‘మూన్లైటింగ్’ దుమారం రేగుతున్న నేపథ్యం లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.