న్యూఢిల్లీ, నవంబర్ 11: భారత ఆర్థికాభివృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ద్రవ్య సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు వరుసపెట్టి తగ్గిస్తున్న క్రమంలోనే తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సైతం కుదించింది. 2022 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి 7 శాతానికి పరిమితమవుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ శుక్రవారం ప్రకటించింది. ఇదే సంస్థ ఈ ఏడాది మే నెలలో 8.8 శాతం వృద్ధి రేటును అంచనావేయగా, దానికి సెప్టెంబర్లో 7.7 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరోసారి అంచనాల్ని దించింది. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీరేట్లు, మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కలిపి భారత్ ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయని ‘గ్లోబల్ అవుట్లుక్ 2023-24’లో మూడీస్ వ్యాఖ్యానించింది. 2023లో భారత్ వృద్ధి రేటు మరింతగా 4.8 శాతానికి క్షీణిస్తుందని, అటుతర్వాత 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని వివరించింది. మూడీస్ వ్యాఖ్యలివి…
ఈ నెలాఖర్లో క్యూ2 జీడీపీ డాటా
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరం క్యూ1 జీడీపీ 13.5 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 4.10 శాతం వృద్ధి నమోదయ్యింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికపు గణాంకాలు ఈ నెలాఖర్లో విడుదలవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని రిజర్వ్బ్యాంక్ అంచనా వేస్తున్నది.