న్యూఢిల్లీ : నిత్యావసరాల ధరలు ఎగబాకడంతో గత నెల నుంచి కిరాణా సరుకుల బిల్లులతో సామాన్యుల గుండెలు గుబేలుమంటున్నాయి. ఉప్పు, పప్పు నుంచి పాలు, కిరాణా సామాగ్రి, పండ్లు ఇలా ఒకటేమిటి ఏ వస్తువు కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. పాలు, గోధుమ, బియ్యం, పప్పు ధాన్యాల ధరలు భారమవడంతో ఏం కొనే పరిస్ధితి లేదని సామాన్యుడు వాపోతున్నాడు.
ఉత్పత్తి వ్యయాలు పెరగడం, దేశీ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం, ఎగుమతులకు డిమాండ్ ఊపందుకోవడం, సరఫరాలు తగ్గడం, ద్రవ్యోల్బణం ఎగబాకడంతోనే ధరలు భగ్గుమంటున్నాయని హోల్సేల్, రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. మరికొద్ది కాలం ఇదే పరిస్ధితి కొనసాగనుండటంతో రాబోఏ రోజుల్లోనూ నిత్యావసరాల ధరలు చుక్కలు చూస్తాయని అంటున్నారు. గత కొద్దినెలలుగా పాల ధరలు 14-15 శాతం పెరగ్గా ఈ నెల ఆరంభంలో తాజాగా పాల ధరలను మరోసారి పెంచారు. మరోవైపు ఎల్పీజీ ధర పెరిగి గ్యాస్ బండ గుదిబండ కావడంతో కిచెన్ బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని గృహిణులు ఆవేదన చెందుతున్నారు.
అమూల్ సహా పలు ఇతర బ్రాండ్ల పాల ధరలు గణనీయంగా పెరిగాయి. బియ్యం ధరలు కూడా ఒక్క నెల వ్యవధిలో భారీగా పెరిగాయి. బాస్మతి, నాన్ బాస్మతి రైస్ ధరలు ఇటీవల ఏకంగా 15 శాతం ఎగబాకాయి. గోధుమ ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు ఏం తినాలో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో పప్పు ధాన్యాలు, కోడిగుడ్ల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.
డిసెంబర్లో 5.72 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో ఏంకగా 6.52 శాతానికి ఎగబాకడంతో నిత్యావసర ధరలు మంటెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. జనవరిలో కూరగాయల ధరలు కొంత తగ్గుముఖం పట్టినా గుడ్లు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, నూనెల ధరలు బారమయ్యాయి.