ఏప్రిల్లో రూ.29 లక్షల కోట్ల పైమాటే
కొవిడ్ సెకండ్ వేవ్తో భారీగా పెరిగిన నగదు నిల్వలు
ముంబై, మే 4: దేశంలో నగదు చలామణి నానాటికీ పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ ఈ ధోరణి కొనసాగుతున్నది. గత నెలలోని తొలి నాలుగు వారాల్లో భారతీయులు బ్యాంకుల నుంచి రూ.57,800 కోట్ల నగదును ఉపసంహరించుకున్నారు. దీంతో మార్చి 26 నాటికి ప్రజల చేతుల్లో రూ.28,58,547 కోట్లుగా ఉన్న నగదు ఏప్రిల్ 23 నాటికి రూ.29,07,067 కోట్లకు పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది రూ.7,352 కోట్లు ఎక్కువ. అయితే దేశంలో ఆర్థిక లావాదేవీల కోసం ఓవైపు డిజిటల్ మాధ్యమాల వినియోగం పెరుగుతున్నప్పటికీ మరోవైపు ప్రజల చేతిలో నగదు నిల్వలు కూడా పెరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ ఏడాది మార్చిలో యూపీఐ ద్వారా 230 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.5 లక్షల కోట్ల పైమాటే. . లాక్డౌన్ సందర్భంగా ఖర్చులకు పెద్దగా మార్గాల్లేకపోయినప్పటికీ ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతున్నదని, ఎక్కువ మంది ప్రజలు తమ ఇండ్లలో నగదును నిల్వ చేయడానికి ఇదే ప్రధాన కారణమని బ్యాంకర్లు అంటున్నారు.