PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) గత తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో వాటి ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. 2017-22 మధ్య 7,189 పీఎస్బీ శాఖలు మూతబడితే, 13,211 ప్రైవేట్ బ్యాంక్ శాఖలు ఏర్పాట య్యాయి. 2021-22 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకు శాఖలు 2,044 తగ్గితే, ప్రైవేట్ బ్యాంకు శాఖలు 4,023 మేర పెరిగి 34,342కు చేరినట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) తెలిపింది. బ్యాంకుల విలీనం, శాఖల కుదింపు ప్రభావం 75 శాతం మేర ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐపైనే పడినట్టు ఆర్బీఐనే ఓ నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత బీవోబీ ప్రభావితమైంది.
ఉద్యోగులపై పని ఒత్తిడి
శాఖల కుదింపుతో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో పీఎస్బీల్లో పనిచేసే ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్నది. అయినప్పటికీ, బీజేపీ సర్కారు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టట్లేదు. అంతటితో ఆగకుండా పీఎస్బీల బ్యాంకుల ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతున్నది. ఈ క్రమంలోనే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న విధానంతో దేశానికి మంచి కంటే హాని ఎక్కువ జరుగుతుందని ఆర్బీఐ హెచ్చరించింది. అయినప్పటికీ, కేంద్రం తన ఏకపక్ష విధానాలను వీడట్లేదు.