స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏ సామాజిక లక్ష్యం కోసం బ్యాంక్ల జాతీయకరణ జరిగిందో, అదే లక్ష్యానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడి ముంగిట్లో బ్యాంకింగ్ సేవల్ని అందించడం, అధిక వడ్డీలు పిండుకునే వ్యాపారుల బారి నుంచి రక్షించి చౌకగా రుణాలు అందించడం, మారుమూల ప్రాంతాలకు బ్యాంకుల్ని విస్తరించడం, లాభాపేక్షే ప్రధానం కాకుండా సమాజహితం కోసం పనిచేయాలన్న ధ్యేయంతో 1970వ దశకంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 20 ప్రైవేటు బ్యాంకుల్ని ఒక్కసారిగా జాతీయం చేయగా, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వానిది ఒకటే అజెండా! ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని (పీఎస్బీలు) ఒకదానిలో మరోదానిని విలీనం చేసి కుదించడం, క్రమేపీ వాటిని ప్రైవేటుకు అమ్మేయడం, విక్రయానికి మంచి ధర పలికేందుకు లాభసాటికాని శాఖల్ని మూసేయడం, సిబ్బందిని తగ్గించడమే పనిగా మోది సర్కారు పనిచేస్తున్నది.
జాతీయం చేసిన 20 బ్యాంక్ లు ఒకదానిలో మరోటి విలీనం కావడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని అనుబంధ బ్యాంకుల విలీనం జరగడంతో ఇప్పుడు మొత్తం పీఎస్బీల సంఖ్య తగ్గిపోయింది. 2017లో 27 పీఎస్బీలు ఉండగా, ఇప్పుడా సంఖ్య 12కు పరిమితమయ్యింది. వీటిలో కొన్నింటిని ప్రైవేటుపరం చేసి పీఎస్బీలను నాలుగుకు తగ్గిద్దామన్న ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం ఉంది.
4 వేలు పెరిగిన ప్రైవేట్ బ్యాంకు శాఖలు
2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలు 2044 తగ్గితే, ఇదే ఏడాదిలో ప్రైవేట్ బ్యాంకుల శాఖలు 4023 మేర పెరిగి 34,342 శాఖలకు చేరినట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) తెలిపింది. 2020లో ప్రభుత్వరంగ బ్యాంకు శాఖల సంఖ్య 90,520 ఉండగా, 2021 88,265 కు తగ్గాయి. 2022 మార్చి నాటికి ఇవి 86,221 మాత్రమే ఉన్నాయని ఏఐబీఈఏ వివరించింది. గడిచిన ఐదు ఏండ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, శాఖల కుదింపు వల్ల 3400 శాఖలు తగ్గినట్టు ఆర్బీఐకి సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వ్యక్తి చేసుకున్న దరఖాస్తు ద్వారా వెల్లడయ్యింది. బ్యాంకుల విలీనం, శాఖల కుదింపు ప్రభావం ఎక్కువగా 75 శాతం వరకు భారతీయ స్టేట్ బ్యాంక్పైనే పడినట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పేర్కొంది. ఎస్బీఐ తర్వాత అధికంగా బీవోబీపై విలీనం, మూసివేత ప్రభావం చూపినట్టు ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1283 శాఖలు విలీనం, మూసివేతకు గురైనట్టు పేర్కొంది.
ప్రైవేటుకు బ్యాంకింగ్ పట్టం
ఒక పట్టణంలో ప్రభుత్వ బ్రాంచీల సంఖ్య తగ్గడం వల్ల ఖాతాదారులు తమకు అందుబాటులో ఉండే ప్రైవేట్ బ్యాంకుల వైపు మొగ్గుచూపుతారు.ఉదాహరణకు ఒక వీధిలో గతంలో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలు, బ్యాంకుల విలీనం, మూసివేత తర్వాత ఒకే బ్యాంక్గా అవతరించింది. దీంతో అందుబాటులో ఉన్న ప్రైవేట్ బ్యాంకు శాఖల్లో జనం ఖాతాలు తెరుస్తారు. అలాగే పీఎస్బీల చెందిన ఖాతాదారులు ప్రైవేట్ బ్యాంకులకు బదిలీ అవుతారు. తద్వారా వాటి లావాదేవీలు పెరిగి, పరోక్షంగా లాభాలు పెరగడానికి దోహదం చేస్తుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలతో ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ కనుమరుగై, ప్రైవేటు రంగానికి భారీ లబ్ది చేకూరుతుంది. మోదీ వాణిజ్య మిత్రులుగా పేరొందినవారు బ్యాంకింగ్ రంగంలో హవా చూపిస్తారు.
మంచిది కాదంటూ ఆర్బీఐ హెచ్చరిక
పీఎస్యూ బ్యాంకుల ప్రైవేటీకరించాలన్న విధానంతో దేశానికి మంచి కంటే హాని ఎక్కువ జరుగుతుందని ఇటీవల రిజర్వ్బ్యాంక్ హెచ్చరించింది కూడా. రెండు బ్యాంకుల్ని విక్రయించాలన్న కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనను ఆర్బీఐ ఒక బులిటెన్లో ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున జరిగే ప్రైవేటీకరణ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక సేవల విస్తరణ, ద్రవ్య విధానాన్ని బ్యాంక్లు అమలు జరపడం వంటి సామాజిక లక్ష్యాలు పరిపూర్తికావని హెచ్చరించింది. గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఎక్కువ శాఖలు ప్రభుత్వ బ్యాంకులవేనని, ప్రైవేటీకరణతో బ్యాంకింగ్ సేవల విస్తరణ లక్ష్యం దెబ్బతింటున్నదన్నది. కానీ ఇందుకు భిన్నంగా భారీ సంఖ్యలో పీఎస్బీ బ్యాంకు శాఖల మూసివేత జరుగుతున్నది. సిబ్బందిని తగ్గించివేస్తున్నారు. కొత్త నియమకాల్లో కోత పెడుతున్నారు. ఒక్క 2022లోనే 13,000 సిబ్బందిని తగ్గించడమే కాకుండా తాజా నియామకాలు 6,000కు పడిపోయాయి. ఇదే అదనుగా ప్రైవేటు బ్యాంకులు గ్రామాలు, చిన్న పట్టణాల్లోకి చొచ్చుకుపోతున్నాయి.