New EV Policy | గతంతో పోలిస్తే విద్యుత్ వెహికల్స్ కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. మోటారు సైకిళ్లు.. స్కూటర్లు మొదలు త్రీ వీలర్స్.. కార్ల వరకు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. టెస్లా వంటి విదేశీ కార్ల తయారీ సంస్థలూ.. భారత్ మార్కెట్లోకి ఎంటర్ కావాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారీ సుంకాలు విధిస్తున్న కేంద్రం.. తాజాగా ఇరు వైపులా ఆమోద యోగ్యమైన కొత్త విద్యుత్ వాహనాల విధానం (EV Policy) రూపొందించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. దేశీయంగా కార్ల తయారీ చేపడితే 100 శాతం నుంచి 15 శాతానికి దిగుమతి సుంకం తగ్గించే ప్రతిపాదన కేంద్రం సిద్ధం చేసిందని పలు ఆంగ్ల దినపత్రికలు తెలిపాయి.
విదేశాల్లో తయారై.. భారత్లోకి దిగుమతి అవుతున్న కార్లపై 70-100 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నది. ఇది తమ కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించిన ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ .. సుంకం తగ్గించాలని కోరినా.. కేంద్రం ససేమిరా అంది.
తాజాగా కేంద్రం తన వైఖరిని కాసింత సడలించిందని తెలుస్తున్నది. దేశీయంగా కొన్ని విడి భాగాలు తయారు చేసినా దిగుమతి సుంకం 15 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని అధికార వర్గాల కథనం. దిగుమతి సుంకం తగ్గించాలన్న టెస్లా ప్రతిపాదనకూ కేంద్రం సానుకూలంగానే ఉన్నదని ఆ వర్గాల కథనం. దీనిపై అటు టెస్లా గానీ, ఇటు కేంద్రం గానీ అధికారికంగా స్పందించలేదు.
ప్రస్తుతం దేశీయ కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ రెండు శాతమైనా క్రమంగా ఈవీ కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. ఇప్పుడు ఆమోదయోగ్యమైన పాలసీని కేంద్రం తీసుకొస్తే.. విదేశాల నుంచి దిగుమతయ్యే కార్ల ధరలు భారీగా దిగి వస్తాయి. టెస్లాతోపాటు పలు కార్ల తయారీ కంపెనీలకు తలుపులు తెరిచినట్లే అవుతుంది.
దేశీయంగా టెస్లా తయారు చేసే కార్లతోపాటు ఇతర మోడల్ కార్లు.. పలు గ్లోబల్ కార్ల తయారీ కార్లు దేశంలో ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోనే ఉంటాయని భావిస్తున్నారు. అయితే కొత్త ఈవీ పాలసీ ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందని అధికార వర్గాల కథనం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్న టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలపై, దేశీయ కార్ల మార్కెట్ మీద ఎలా ప్రభావం ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది అధికార వర్గాల కథనం.