న్యూఢిల్లీ, జనవరి 30: ఖర్చుకు తగ్గ ఆదాయంలేక, కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రుణాల కోసం ఎగబడుతున్నదని, ఫిబ్రవరి 1న లోక్సభకు సమర్పించనున్న 2023-24 కేంద్ర బడ్జెట్లో రుణ సమీకరణను భారీగా పెంచుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రికార్డుస్థాయిలో రూ.16 లక్షల కోట్ల విలువైన రుణాల్ని సమీకరిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.14.32 లక్షల కోట్లకంటే కంటే రూ.1.68 లక్షల కోట్లు ఎక్కువ. ప్రసిద్ధ వార్తా సంస్థ రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు…గత నాలుగేండ్ల నుంచి నరేంద్ర మోది ప్రభుత్వ రుణాలు రెట్టింపయ్యాయని గుర్తుచేశారు. రూ. 4 లక్షల కోట్ల వరకూ కాలపరిమితి ముగిసిన బాండ్లకు చెల్లింపులు చేయాల్సి ఉన్నందున గరిష్ఠంగా రుణ సమీకరణ రూ.17.2 లక్షల కోట్ల వరకూ పెరగవచ్చని రాయిటర్స్ సర్వేలో పాల్గొన్న 43మందిలో కొంతమంది ఆర్థిక వేత్తలు అంచనా వేశారు.
మూడేండ్ల నుంచి ప్రభుత్వం పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నందున, ఏడేండ్ల నుంచి అధికస్థాయిలోనే రుణ సమీకరణ ఉంటున్నందున, చెల్లింపుల భారం కూడా తడిసిమోపెడవుతుందని ఏఎన్జడ్ గ్రిండ్లేస్ బ్యాంక్ ఎకానమిస్ట్ ధీరజ్ నిమ్ చెప్పారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం బాండ్లకు చెల్లింపులు రూ.4.4 లక్షల కోట్ల మేర ఉంటాయన్నారు.
లోటు పోటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు (ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) 6.4 శాతంగా 2022-23 బడ్జెట్లో నిర్దేశించారు. ఈ మేరకు అంతక్రితం ఏడాదికంటే మార్కెట్ రుణాలు పెరిగాయి. 2023-24లో ద్రవ్యలోటును 6 శాతానికి ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది 4-5 శాతం సగటుకంటే ఎక్కువేనని ఎకానమిస్టులు తెలిపారు. పాండమిక్ ముందస్తుస్థాయికంటే ద్రవ్యలోటు ప్రస్తుతం రెట్టింపునకు పైగా పెరిగింది. మరోవైపు ద్రవ్యలోటును 5.9 శాతానికి కుదిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు సంకేతాల్ని ఇస్తున్నది. అయితే బడ్జెట్లో వ్యయాల పద్దులో బాగా కోత విధిస్తే తప్ప ద్రవ్యలోటు ప్రభుత్వం చెపుతున్నదానికంటే ఎక్కువే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వ్యయాల్లో ఐదో వంతు వడ్డీలే
ప్రతీ ఏటా పెరిగే లోటు కారణంగా ప్రభుత్వ రుణాలు పెరిగిపోయి, బడ్జెట్లో ప్రతిపాదించే వ్యయాల్లో మూడోవంతు వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు జీడీపీలో 3.1 శాతానికి పెరిగి రూ.7.31 లక్షల కోట్లకు చేరాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 నుంచి చూస్తే ఈ వడ్డీ చెల్లింపులు రెట్టింపునకు పైగా పెరిగాయి.
చిన్న మొత్తాల పొదుపునూ వదలరు
ప్రభుత్వం బాండ్ల ద్వారానే కాకుండా ట్రెజరీ బిల్స్ రూపంలో స్వల్పకాలిక రుణాలు సేకరిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు ద్వారా సమకూరే మొత్తాన్ని సైతం కేంద్రం రుణంగా తీసుకుంటుంది. చిన్న మొత్తాల పొదుపు ద్వారా రూ.5.5 లక్షల కోట్లు లభిస్తాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పొదుపు ద్వారా తీసుకునే మొత్తం కూడా ప్రభుత్వానికి రుణమే. 2024 మే నెలలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చేవారంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించబోయేది పూర్తిస్థాయి బడ్జెట్ అయినందున, ఇది బీజేపీ ప్రభుత్వానికి కీలకమైన పరీక్ష ఆర్థిక విశ్లేషకులు చెపుతున్నారు. 2024 మే నెలలో లోక్సభ ఎన్నికలు ఉన్నందున, ఆ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను మాత్రమే సమర్పిస్తారు.