హైదరాబాద్, ఆగస్టు 11 (బిజినెస్ బ్యూరో): ఎలక్ట్రానిక్ వేస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్లో దేశంలో తొలిసారిగా మిషన్ ఈవేస్ట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు చేతుల మీదుగా మిషన్ ఈవేస్ట్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…ఉపయోగించని లేదా సరిగా పని చేయని ఎలక్ట్రానిక్ పరికరాలను సరైన రీతిలో నిర్వహించకుండా వాటిని ఇళ్లలోనే అట్టిపెట్టుకుంటున్నారని, ఇది ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తున్నదన్నారు. మిషన్ ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సెలెక్ట్ మొబైల్స్ చొరవను మంత్రి ప్రశంసించారు.
ఐటీ కారిడార్లు, మాల్స్, బస్టాప్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండే కీలక ప్రదేశాల్లో వ్యూహాత్మకంగా ఈ-వేస్ట్ డబ్బాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కంపెనీని కోరారు. వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్గా మారిందని గుర్తు చేసిన మంత్రి… మానవాళికి అతిపెద్ద సవాల్గా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్ పోగవుతోందని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యం, పర్యావరణంపై ఈవేస్ట్ ప్రభావానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తూ బాధ్యతాయుత పరిష్కారంతో ఒక అడుగు ముందుకేసినట్లు వై గురు తెలిపారు. పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను సెలెక్ట్ రిటైల్ స్టోర్లకు తీసుకు వస్తే చాలు.. కస్టమర్లు రూ.1,000 మొదలుకుని రూ.10,000 వరకు డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కూపన్ కాల పరిమితి ఆరు నెలల వరకు ఉంటుంది.
మొబైళ్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ పీసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను డిపాజిట్ చేయడం ద్వారా వినియోగదార్లు డిస్కౌంట్ కూపన్ పొందవచ్చు. ఇందుకోసం ప్రతి సెలెక్ట్ ఔట్లెట్లో ప్రత్యేకంగా ఈవేస్ట్ బిన్స్ను ఏర్పాటు చేస్తారు. అలాగే నివాస స్థలాలు, పాఠశాలలు, దేవాలయాలు, ఇతర కీలక ప్రాంతాల్లోనూ ఈవేస్ట్ కియోస్క్లను అందుబాటులో ఉంచడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పా రు. భారత్లో ఈ-వేస్ట్ ఉత్పత్తులు ఏటా 20-25 శాతం వరకు పెరుగుతున్నాయని, 2020లో 10.45 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, 2023 నాటికి 18.3 లక్షల టన్నులకు చేరుకున్నది. 2025 నాటికి 25.4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా.