Mobile Rates Costly | స్మార్ట్ ఫోన్లలో వాడే విడి భాగాలపై కస్టమ్స్ సుంకంలో రాయితీలు ప్రకటించినా.. వాటి ధరలు తగ్గబోవని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) తగ్గించినా.. పెరిగిన ఆయా విడి భాగాల ధరల్లో కలిసిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. విడి భాగాల కొరత, సప్లయ్ చైన్లో సమస్యలతో ఆయా కాంపొనెంట్స్ అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నదని తెలిపారు.
కరోనా మహమ్మారి ఉధృతి పెరిగిపోవడంతో కంప్యూటర్లు, టాబ్లెట్లు, లాప్టాప్లు, మొబైల్ పోన్లకు గిరాకీ ఎక్కువైంది. పర్సనల్ మొబిలిటీ పెరిగిపోయింది. ఫలితంగా చిప్ల కొరత ఏర్పడింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు చిప్లు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. కనుక బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల స్మార్ట్ ఫోన్ల ధరలపై ప్రభావం ఉండదని టెక్ ఆర్క్ ఫౌండర్ ఫైజల్ కావూసా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం స్మార్ట్ఫోన్ల తయారీలో వాడే కెమెరా లెన్స్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15/10 నుంచి 2.5 శాతానికి తగ్గింది. మొబైల్ చార్జర్లు లేదా అడాప్టర్ల తయారీలో వాడే ట్రాన్స్ఫార్మర్లపై బీసీడీ 10/15 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. బుధవారం (2022 ఫిబ్రవరి 2) నుంచి 2024 మార్చి 31 వరకు ఈ రాయితీలు వర్తిస్తాయని తెలిపింది. దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని ప్రోత్సహించడానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడి భాగాలపై సుంకాలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
సప్లయ్ చైన్లో సమస్యలు, విడి భాగాల కొరతతో టెలికం రంగం సమస్యలు ఎదుర్కొంటున్నది. ఉత్పత్తిని పెంపొందించేందుకు కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో వృద్ధిరేటును ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.