న్యూఢిల్లీ, నవంబర్ 9: స్మార్ట్ఫోన్లలో నేరుగా టెలివిజన్ ప్రసారాలు వద్దని, దీనివల్ల మొబైల్ తయారీ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుందని మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ సంఘం ఐసీఈఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెలీకమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సెంటర్ (టీఈసీ) ఈ అంశంపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఐసీఈఏ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
మొబైల్ ఫోన్లలో ఏటీఎస్సీ 3.0 టెక్నాలజీని ఏర్పాటు చేయాలని టీఈసీ అంటున్నది. సెల్యులార్ నెట్వర్క్తో పనిలేకుండా టీవీ ప్రసారాలకు వీలుకానున్నది అంటున్నారు. అయితే ఇందుకు ఇప్పుడున్న తమ తయారీ వ్యవస్థలో భారీగా మార్పులు చేయాల్సి ఉంటుందని, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఐసీఈఏ చెప్తున్నది. ఫోన్ ధరలు కూడా పెరుగుతాయని, ఫలితంగా అమ్మకాలు ప్రభావితం కావచ్చని అంటున్నది.