ముంబై, జూలై 31: కేవలం బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికే భారతీయుల్లో 60 శాతంమంది మొబైల్స్ ద్వారా లాగిన్ అవుతున్నారని ఒక సర్వేలో వెల్లడయ్యింది. అలాగే నూటికి 78 మంది వారి సమీపంలోని బ్యాంక్ శాఖలకు వెళ్లడానికే మొగ్గుచూపుతున్నారని, మొబైల్ బ్యాంకింగ్కంటే శాఖల్ని స్వయంగా సంప్రదించడం మెరుగని తమ సర్వేలో అభిప్రాయపడుతున్నట్టు గ్లోబల్ ఐటీ సంస్థ యా క్సెంచర్ తెలిపింది. భారత్లో బ్యాంక్లు గణనీయమైన డిజిటలైజేషన్ జరిపాయని, అయితే ఈ డిజిటల్ చానళ్లు వినియోగదారుల భావోద్వేగాలకు చేరువకావడం లేదని యాక్సెంచర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా లీడ్ సోనాలి కులకర్ణి వివరించారు. ఇండియాతో సహా 33 దేశాల్లో 49,000 మంది వినియోగదారులతో యాక్సెంచర్ సర్వే నిర్వహించింది. ఇందు లో భారత్కు చెందిన 2 వేల మంది ఉన్నారు.